మూడో దశ పరీక్షలకు బయోలాజికల్‌ టీకా సిద్ధం.. తయారీతో పాటు నిల్వ, పంపిణీ కూడా సవాలే అంటున్న బీఇ ఎండీ

మాయదారి కరోనాను తరిమికొట్టేందుకు యావత్ ప్రపంచం శ్రమిస్తోంది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న టీకా పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి.

మూడో దశ పరీక్షలకు బయోలాజికల్‌ టీకా సిద్ధం.. తయారీతో పాటు నిల్వ, పంపిణీ కూడా సవాలే అంటున్న బీఇ ఎండీ
Follow us

|

Updated on: Nov 24, 2020 | 6:35 PM

మాయదారి కరోనాను తరిమికొట్టేందుకు యావత్ ప్రపంచం శ్రమిస్తోంది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న టీకా పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన టీకాల తయారీ సంస్థ బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ (బీఇ) అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాపై వచ్చే ఏడాది జనవరి తర్వాత మూడో దశ క్లినికల్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయని ఆ సంస్థ ఎండీ మహిమా దాట్ల తెలిపారు.

అమెరికాకు చెందిన బేలార్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌, డైనావాక్స్‌ టెక్నాలజీస్‌తో కలిసి బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ సంయుక్తంగా కరోనా టీకాను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మొదటి- రెండో దశ క్లినికల్‌ పరీక్షలు ఇటీవల ప్రారంభం అయ్యాయి. ఈ ఫలితాలు జనవరి నెలాఖరు నాటికి వెల్లడవుతాయి. ఆ తర్వాత నేరుగా మూడో దశ క్లినికల్‌ పరీక్షలు ప్రారంభించే అవకాశం ఉందని బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ ఎండీ మహిమా దాట్ల తెలిపారు.

మూడో దశ క్లినికల్‌ పరీక్షలకు దాదాపు 30,000 మంది వలంటీర్లను ఎంపిక చేశామని ఆమె తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌ – జులై నాటికి ఈ పరీక్షల పలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌తోనూ తమకు టీకా తయారీ ఒప్పందం ఉందన్న ఆమె.. ఆ కంపెనీ అభివృద్ధి చేసిన కరోనా టీకాపై ఇప్పుడు మూడో దశ క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయని వెల్లడించారు.

ప్రపంచ వ్యాప్తంగా 45 టీకాలు క్లినికల్‌ పరీక్షల దశకు చేరాయి. ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్ర జెనేకా టీకా 70 శాతానికి పైగా సమర్థతను నమోదు చేసిందని ప్రకటించుకుంది. ఈ పరిణామాలను చూస్తుంటే, త్వరలో కరోనా టీకా అందుబాటులోకి వస్తుందన్న నమ్మకం కలుగుతోందన్నారు మహిమా. టీకా ప్రభావంతో పాటు వయస్కుల వారిగా పనితీరు నిర్థారణ కావాల్సి ఉందన్నారు. అలాగే టీకా పంపిణీ కూడా సంక్టిష్టమైన పనిగా ఆమె విశ్లేషించారు. తయారీ సామర్థ్యాన్ని సమకూర్చుకోవడం కూడా సవాలేనని పేర్కొన్నారు. ప్రపంచ జనాభా మొత్తానికి 1600 కోట్ల డోసుల టీకా అవసరమవుతుందన్ మహిమా దాట్ల.. ప్రస్తుతం తయారీ సామర్థ్యం 800 కోట్ల డోసులు మాత్రమేనని తెలిపారు. ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ రావాలంటే జనాభాలో 70 శాతం మందికి అయినా టీకా ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. టీకా తయారీ సామర్థ్యం మనదేశంలో ఎంతో అధికంగా ఉండటం ఒక సానుకూలతగా చెబుతూ, ఏటా యునిసెఫ్‌ అవసరాల్లో 70 శాతం వరకు టీకాలను మనదేశమే సరఫరా చేస్తోందని వివరించారు.