నిరాకరించిన 8 ఆసుపత్రులు.. అంబులెన్స్లో గర్భిణి మృతి..!
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కరోనా అనుమానిత లక్షణాలున్న ఓ గర్భిణిని చేర్చుకునేందుకు 8 ఆసుపత్రులు నిరాకరించాయి.
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కరోనా అనుమానిత లక్షణాలున్న ఓ గర్భిణిని చేర్చుకునేందుకు 8 ఆసుపత్రులు నిరాకరించాయి. దీంతో అంబులెన్స్లోనే ఆ గర్భవతి కన్నుమూసింది.
వివరాల్లోకి వెళ్తే.. గజియాబాద్లోని ఖోడా కాలనీకి చెందిన నీలమ్ కుమారి(30) అనే 8 నెలల గర్భవతికి శుక్రవారం నొప్పులు ప్రారంభం అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చేందుకు తీసుకెళ్లారు. అయితే బెడ్లు, వెంటిలేటర్లు లేవని సాకులు చెబుతూ పలు ఆసుపత్రులు నీలమ్ను చేర్చుకునేందుకు నిరాకరించారు. ఇలా 13 గంటలుగా వారు నోయిడాలోని 8 ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయితే ఏ ఆసుపత్రి ఆమెను చేర్చుకోకపోవడంతో బీపీ ఎక్కువ అవ్వడంతో నీలమ్ కన్నుమూసింది. ఈ విషయం తెలిసిన జిల్లా అధికారి విచారణకు ఆదేశించారు.
కాగా నీలమ్కు ఈఎస్ఐ కార్డు ఉండటంతో మొదట ఈఎస్ఐసీ ఆసుపత్రికి తీసుకెళ్లామని అక్కడ ఆక్సిజన్ పెట్టిన వైద్యులు సెక్టార్ 30లోని జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారని ఆమె సోదరుడు శైలేంద్ర అన్నారు. అయితే తాము కంటెన్మెంట్ జోన్ నుంచి వచ్చినందున జిల్లా ఆసుపత్రిలో చేర్చుకునేందుకు సంబంధిత అధికారులు నిరాకరించాయని, కనీసం వారు నీలమ్కి పరీక్షలు కూడా చేయలేదని ఆయన చెప్పారు. ఆ తరువాత ఆరు ఆసుపత్రులను తిరిగామని.. కానీ బెడ్లు, వెంటిలేటర్లు లేవంటూ ఎవరూ తమ సోదరిని చేర్చుకోలేదని వెల్లడించారు. ఇక మరోసారి జిమ్స్(GIMS)ఆసుపత్రికి వెళ్లగా, అప్పటికే తమ సోదరి అపస్మారక స్థితిలోకి వెళ్లిందని, పరీక్షలు చేసిన డాక్టర్లు నీలమ్ మరణించినట్లు తెలిపారని శైలేంద్ర పేర్కొన్నారు. కాగా కరోనా వేళ చాలా మంది గర్బిణిలను ఆసుపత్రుల్లో చేర్చుకునేందుకు యాజమాన్యాలు నిరాకరిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా పలువురు గర్భిణిలు చనిపోతున్నారు. తెలంగాణలోని గద్వాలలోనూ ఇదే తరహా ఘటన జరిగిన విషయం తెలిసిందే.
Read This Story Also: కడపలో విషాదం.. లారీ డ్రైవర్, క్లీనర్ సజీవదహనం