UP Elections 2022: యూపీ ఎన్నికల్లో పొత్తులపై అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
UP Assembly Election 2022: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన పార్టీలన్నీ దృష్టిసారించాయి. ప్రధాన పార్టీలన్నీ ఎవరికీ వారే యమునాతీరే అన్నట్లు... ఒంటరిగా బరిలోకి దిగాలని యోచిస్తున్నాయి.
UP Assembly Election 2022: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన పార్టీలన్నీ దృష్టిసారించాయి. ప్రధాన పార్టీలన్నీ ఎవరికీ వారే యమునాతీరే అన్నట్లు… ఒంటరిగా బరిలోకి దిగాలని యోచిస్తున్నాయి. యూపీ ఎన్నికల్లో పొత్తులు ఉండబోవని, తమ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగబోతున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక ప్రకటన చేశారు. ప్రధాన పార్టీలు ఒంటరి పోరుకు దిగితే…ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి అధికార బీజేపీకి లాభం చేకూరే అవకాశముందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి సమాజ్వాది పార్టీ(SP) చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో చిన్న పార్టీలతో పొత్తుపెట్టుకోబోతున్నట్లు ఆయన ప్రకటించారు. యూపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా మార్పునకు ఓటు వేస్తారని ధీమా వ్యక్తంచేశారు.
2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజాస్వామ్య విప్లవం రాబోతున్నట్లు అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు. అధికార పగ్గాలను సమాజ్వాది పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. యూపీలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ పూర్తిగా మర్చిపోయిందని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ చెత్తబుట్టలో పడేసిందని, ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు యూపీ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. 403 అసెంబ్లీ స్థానాలు కలిగిన యూపీలో…వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 350కి పైగా స్థానాల్లో గెలుస్తుందని అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అధికార బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
యూపీలో ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో సమాజ్వాది పార్టీ పైచేయి సాధించడం తెలిసిందే. మొత్తం 3050 పంచాయితీల్లో స్వతంత్ర అభ్యర్థులు 1081 పంచాయితీలను గెలుచుకున్నారు. సమాజ్వాది పార్టీ మద్ధతుతో బరిలో నిలిచినవారు 851 పంచాయితీలు గెలుచుకోగా…అధికార బీజేపీ మద్ధతుతో పోటీచేసిన వారు 618 పంచాయితీలు గెలుచుకున్నారు. బీఎస్పీ మద్ధతుపొందిన అభ్యర్థులు 320 పంచాయితీల్లో విజయం సాధించారు.
Also Read..
వైఎస్సార్, ఎన్టీఆర్ను తిట్టినవారంతా నికృష్టులే.. రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..
హూజురాబాద్ నేతలకు బంపర్ ఆఫర్.. ఉప ఎన్నికల్లో మద్దతు ఇస్తే కారు గిఫ్ట్ !?