విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై భగ్గుమన్న గంటా.. ఉద్యమానికి జేగంట భజాయిస్తామన్న టీడీపీ ఎమ్మెల్యే
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిధుల సమీకరణకు రూపొందించిన దేశవ్యాప్త పాలసీలో..
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిధుల సమీకరణకు రూపొందించిన దేశవ్యాప్త పాలసీలో భాగంగా దశాబ్ధాల చరిత్ర కలిగిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ను వందశాతం ప్రైవేటుకు అమ్మకానికి పెట్టింది.
తెలుగు ప్రజలు ప్రాణాలు త్యాగం చేసి సాధించిన ఉక్కు పరిశ్రమ నష్టాల్లో ఉందన్న అపకీర్తిని అంటగట్టి తుప్పు పట్టేలా చేయాలని చూడటం యావత్ ఆంధ్ర ప్రజల్ని విస్మయానికి గురి చేస్తోంది. ఏపీలో ఏకైక భారీ పరిశ్రమగా పేరు గడించిన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీపై ఆధారపడి ప్రత్యక్షంగా…పరోక్షంగా లక్ష కుటుంబాలు బతుకుననాయి. ఇలాంటి పరిశ్రమపైనే కేంద్రం కన్ను వేయడంతో ప్రజాసంఘాలు, విపక్షాలు భగ్గుమంటున్నాయి.
ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, TDP ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. లేదంటే ఢిల్లీ రైతుల ఉద్యమానికి వంద రెట్ల స్థాయిలో తీవ్రతను వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్రాన్ని హెచ్చరించారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దేశంలోని మిగతా పరిశ్రమల్లా చూడొద్దని, విశాఖ ఉక్కు తమ ఆత్మ గౌరవమని ట్వీట్ చేశారు గంటా శ్రీనివాసరావు. మా విశాఖ ప్రజల ఉఛ్వాస నిశ్వాస…. మా నగరం పేరే ఉక్కు నగరం… మా సెంటిమెంట్ని ముట్టుకోవద్దని కేంద్రాన్ని కోరారు.
విశాఖ ఉక్కు నుంచి విశాఖను వేరు చేయడం అంటే తమ ప్రాణాల్ని తమ దేహాల నుంచి వేరు చేయడమేనన్నారు. విశాఖ ఉక్కు 5 కోట్ల ఆంధ్రులు, 20 కోట్ల తెలుగు ప్రజల మనోభావాలు, రాజీ లేని పోరాటాలకు ప్రతీకని పేర్కొన్నారు. దయచేసి మా సెంటిమెంట్ ని ముట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
Read more: