Tamil Nadu Polls: తమిళనాడులో చిన్నమ్మ ప్రకంపనలు… వచ్చీ రాగానే అన్నాడీఎంకే శ్రేణులకు చుక్కలు
తమిళనాడులో అమ్మ జయలలిత తర్వాత స్థానం శశికళ సంపాదించారు. అయితే అక్రమాస్తుల కేసులో అరెస్టై.. బెంగళూరు పరప్పన జైల్లో నాలుగేళ్ల శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలై..తమిళనాడు గడ్డపై..
Tamil Nadu Polls: తమిళనాడులో అమ్మ జయలలిత తర్వాత స్థానం శశికళ సంపాదించారు. అయితే అక్రమాస్తుల కేసులో అరెస్టై.. బెంగళూరు పరప్పన జైల్లో నాలుగేళ్ల శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలై..తమిళనాడు గడ్డపై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రకంపనలు పుట్టిస్తున్నారు. వచ్చీ రాగానే షాకుల మీద షాకులిస్తూ అన్నాడీఎంకే శ్రేణులకు చుక్కలు చూపిస్తున్నారు.
ఐతే ఇదంతా ఒక ఎత్తైతే..ఇప్పుడామె చెన్నై టూర్ మరో ఎత్తు. నాలుగేళ్ల తర్వాత రాష్ట్రానికొచ్చిన చిన్నమ్మకు ఘన స్వాగతం పలికారు ఆమె అనుచరులు. బెంగళూరు నుంచి చెన్నై వరకూ ఐదు గంటలు సాగాల్సిన ప్రయాణం 23 గంటలు పట్టిందంటే..ఏ రేంజ్లో స్వాగతం పలికారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆ గ్రాండ్ అరేంజ్మెంట్స్కైన ఖర్చే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు నుంచి చెన్నై వరకూ ఔరా అనిపించేలా స్వాగత ఏర్పాట్లు చేశారు ఆమె అనుచరులు. దాదాపు వంద కార్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. పూర్ణ కుంభ స్వాగతాలు, అడుగడుగునా పూలను వెదజల్లుతూ చిన్నమ్మను తమిళనాడుకు తీసుకెళ్లారు.
ఐతే హెలికాఫ్టర్ నుంచి పూల వర్షం కురిపించాలని భావించినప్పటికీ కుదరలేదు. ఆ ఒక్కటి మినహా చిన్నమ్మకు ఘనస్వాగతం పలికారు. 23 గంటల పాటు సాగిన శశికళ స్వాగతానికి దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చైనట్లు తెలుస్తోంది. అంటే..గంటకు 8కోట్ల 60లక్షల రూపాయలకుపైమాటే. ఇదంతా శశికళ తన బలాన్ని చాటి చెప్పుకునేందుకే ఇంత ఖర్చు చేసి హడావిడి చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.