వంశీ బాటలోనే రాపాక.. సాక్ష్యమిదే !
ఇంగ్లీషు మీడియంపై అధినేత అభిప్రాయంతో విభేదించిన జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రూటెటు? ఇంగ్లీషు మీడియం అవసరం అంటూనే తెలుగు మీడియంను కూడా కొనసాగించాలన్న పవన్ కల్యాణ్ అభిప్రాయంతో పూర్తిగా విభేదించి, ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని ప్రశంసలతో ముంచెత్తిన రాపాక పార్టీ మారతారా? ఈ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అమరావతిని ముంచెత్తుతున్నాయి. బుధవారం ఏపీ శాసనసభలో ఇంగ్లీషు మాధ్యమం అమలుపై జరిగిన చర్చలో రాపాక రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లీషు మీడియం […]
ఇంగ్లీషు మీడియంపై అధినేత అభిప్రాయంతో విభేదించిన జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రూటెటు? ఇంగ్లీషు మీడియం అవసరం అంటూనే తెలుగు మీడియంను కూడా కొనసాగించాలన్న పవన్ కల్యాణ్ అభిప్రాయంతో పూర్తిగా విభేదించి, ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని ప్రశంసలతో ముంచెత్తిన రాపాక పార్టీ మారతారా? ఈ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అమరావతిని ముంచెత్తుతున్నాయి.
బుధవారం ఏపీ శాసనసభలో ఇంగ్లీషు మాధ్యమం అమలుపై జరిగిన చర్చలో రాపాక రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లీషు మీడియం అవసరంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్కురాపాక క్లాస్ తీసుకున్నారనే చెప్పాలి. సుదీర్ఘ స్పీచ్లో జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని రాపాక గట్టిగానే సమర్థించారు.
రాపాక అసెంబ్లీ స్పీచ్ పూర్తయిన తర్వాత ఆయనపై పార్టీ పరమైన క్రమశిక్షణా చర్యలు ఖాయమనే అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే గురువారం సాయంత్రానికి రాపాకకు జనసేన పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసిందన్న వదంతులు గుప్పుమన్నాయి. అంతలోనే జనసేన పార్టీ నుంచి క్లారిఫికేషన్ వచ్చింది. రాపాకకు ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదన్నది క్లారిఫికేషన్ సారాంశం.
ఇదంతా బాగానే వుంది.. ఉన్న ఒక్క ఎమ్మెల్యేను కోల్పోవడం ఇష్టం లేక జనసేన చర్యలపై వెనక్కు తగ్గిందన్నది ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది కానీ.. రాపాక ఉద్దేశం ఏంటి ? ఆయన దారెటు? ఈ చర్చలు మాత్రం అమరావతిలోను, గోదావరి జిల్లాల్లోను జోరుగా సాగుతున్నాయి. వైసీపీతో కలిసి ముందుకెళ్ళాలన్నది రాపాక ఉద్దేశమని ఆయన ప్రవర్తన, మాటలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కానీ, నేరుగా వైసీపీ తీర్థం పుచ్చుకుని అనర్హత వేటును ఎదుర్కోవడం ఆయనకు ఇష్టం లేదని, తిరిగి పోటీ చేసి ఖర్చు పెంచుకోవడం కూడా ఆయనకు ఇష్టం లేదని తెలుస్తోంది.
అందుకే జనసేన పార్టీ తనపై చర్య తీసుకునేలా ప్రేరేపించాలని, అంతవరకు ఇలాగే అడపాదడపా పవన్ కల్యాణ్కు ఇరిటేషన్ వచ్చేలా జగన్ ప్రభుత్వాన్ని పొగుడుతూ వుండాలని రాపాక భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే.. వల్లభనేని వంశీ బాటలోనే వైసీపీతో కలిసి ముందుకు సాగాల్నది రాపాక వ్యూహమని చెబుతున్నారు. జనసేన చర్య తీసుకునే దాకా ఇదే ధోరణి అవలంభించి, ఆ తర్వాత వంశీ బాటలో స్వతంత్ర్య సభ్యునిగా కొనసాగడం ద్వారా తన ప్రయోజనాలు నెరవేర్చుకోవాలన్నది రాపాక ప్లాన్ అని తెలుస్తోంది.
అయితే దీనికి భిన్నంగా మరో ప్రచారం మరింత ఆసక్తి రేపుతోంది. జనవరి రెండోవారంలో జనసేనకు అఫీషియల్గా రాజీనామా చేసి మరీ వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని రాపాక భావిస్తున్నట్లు ఇంకో ప్రచారం కూడా జరుగుతోంది. పవన్ కల్యాణ్ తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఇద్దరి మధ్య కొంత గ్యాప్ వున్న మాట వాస్తవమని రాపాక వరప్రసాద్ కొందరు సన్నిహిత మీడియా పర్సన్స్తో అన్నట్లు సమాచారం. సో.. ద్విముఖ వ్యూహంలో దేన్ని ఎంచుకుంటారన్న అంశంపై కొంత కాలం సస్పెన్స్ తప్పదన్న మాట.