Telangana Politics: తెలంగాణపై ప్రియాంక గాంధీ ఫోకస్.. మధు యాష్కీ కీలక వ్యాఖ్యలు
యావత్ దేశాన్ని దాదాపు అర్థ శతాబ్ద కాలం పాలించిన ఈ పార్టీ ఒక ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా దక్కించుకోలేని దయనీయ స్థితికి చేరింది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు నాయకత్వం కోసం తమలో తాము కొట్టుకుంటూ..
అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. మునుగోడు ఉప ఎన్నికలలో పూర్తిగా తేలిపోయింది. యావత్ దేశాన్ని దాదాపు అర్థ శతాబ్ద కాలం పాలించిన ఈ పార్టీ ఒక ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా దక్కించుకోలేని దయనీయ స్థితికి చేరింది. పార్టీలోని అంతర్గత సమస్యలే తమ కొంప ముంచాయన్న అభిప్రాయం ఆ పార్టీ నేతలలోనే నెలకొంది. మునుగోడు ఉప ఎన్నికలో ఇతర పార్టీలు పురుషులనే అభ్యర్థులుగా నిలబెట్టేసరికి సింపతీ, సెంటిమెంట్తో పోటీ చేద్దామని అనుకున్నా.. అది కూడా ఆ పార్టీకి లాభం చేకూర్చలేకపోయింది. సీనియర్ నేతలు ఎందరున్నా.. నానాటికీ పార్టీ ప్రభ మసకబారడం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ స్వయంగాా రంగంలోకి దిగాలని కొందరు సీనియర్లు ఇప్పటికే పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్పై పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక గాంధీ వాద్రా ఫోకస్ పెట్టనున్నారని వెల్లడించారు. తద్వారా పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా తెలంగాణ పాలకులను మధు యాష్కీ ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర పాలకులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని బీజేపీ నేతలు, ఆ పని కేంద్రమే చేస్తున్నట్లు టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారని.. దొంగలే దొంగ దొంగ అని అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ విషయంలో తెలంగాణ గవర్నర్ తమిళ సైకి అనుమానం ఉంటే హోం శాఖకు ఫిర్యాదు చేయాలన్నారు. తెలంగాణ వస్తే దుబాయ్ వెళ్లే అవసరం ఉండదని, ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ శాఖను ఏర్పాటు చేస్తానని కేసీఆర్ గతంలో అన్నారని మధు యాష్కీ గుర్తు చేశారు. ప్రతి ఏటా కతర్ నుంచి 25 వేల మందిని అక్కడ నుంచి బయటకు పంపివేస్తున్నారని, ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు సహాయం చేయకపోగా వారి రేషన్ కార్డులను రద్దు చేసిందిన ఆయన విమర్శించారు. తెలంగాణ పాలకులు వెంటనే ఎన్ఆర్ఐ శాఖను ఏర్పాటు చేయాలని.. కేంద్రం కూడా యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డ్ను ఏర్పాటు చేసి నియామకాలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం లిక్కర్ పాలసీని ఢిల్లీ లిక్కర్ సేల్ నుంచి కాపీ చేసిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖపై సీబీఐ విచారణ జరిపించాలని యాష్కీ కోరారు.
తెలంగాణలోని రామగుండంలో ప్రధాని మోదీ ఈ నెల 12న ప్రారంభించబోతున్న ఎరువుల ఫ్యాక్టరీని ఇంతక ముందు మూయించింది బీజేపీయే అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పది వేల కోట్ల రుణాలు మాఫీ చేసిందని, రామగుండం ఫ్యాక్టరీ ప్రారంభానికి ఎంతగానో కృషి చేసిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అంతా తామే చేసినట్లు బీజేపీ ఉత్తుత్తి ప్రచారం చేసుకుంటుందని, అయినా బీజేపీని ప్రజలు నమ్మడంలేదని యాష్కీ తెలిపారు. తెలంగాణకు ప్రధాని మోదీ వచ్చినప్పుడే టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ గొడవ చేస్తారని.. వీరు ఢిల్లీకి వెళ్లినప్పుడు ఆయన కాళ్ల మీద పడి వస్తారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇకపై జరిగే ప్రతి ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులందరూ కలిసి పార్టీ కోసం శ్రమించాలని ఆయన కోరారు. తెలంగాణలో తమ పార్టీ విఫలం కావడానికి కారణాలు ఏమిటనేదానిపై సమీక్షించుకుంటామని.. అందుకు ధన ప్రభావం కారణం కానే కాదని అభిప్రాయపడ్డారు. సమీక్షించుకున్న తర్వాత పూర్తి స్థాయి ప్రణాళికలతో ప్రజలలోకి వెళ్తామని చెప్పారు. త్వరలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక గాంధీ వాద్రా తెలంగాణ బాధ్యతలు తీసుకుంటారని తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని.. యాత్రలో పాల్గొంటున్న ప్రాంతీయ నాయకులు కూడా ఐక్యతగా మెలుగుతున్నారని.. అందరూ అలాగే కలిసి ముందుకు సాగాలని ఆయన కోరారు. క్రమశిక్షణారహితంగా మాట్లాడినా, ప్రవర్తించినా పార్టీపరమైన శిక్షలు తప్పవని కాంగ్రెస్ నాయకులను మధు యాష్కీ హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..