JC Prabhakar Reddy: రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం.. పిల్లల ప్రాణాలతో చెలగాటం: జేసీ ప్రభాకర్ రెడ్డి
రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉండటం చాలా దారుణమన్నారు మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.
JC Prabhakar Reddy – Ration Rice: రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉండటం చాలా దారుణమన్నారు మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి నందలపాడులోని అంగనివాడి సెంటర్లో ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయన్నారాయన. రేషన్ సరఫరా చేస్తున్న డీలర్పై కోర్టుకు వెళ్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. పిల్లలు ప్లాస్టిక్ అన్నం తిని ఆసుపత్రి లో జాన్ అయితే, ప్రభుత్వం ఇచ్చే అమ్మ ఓడి డబ్బులు సరిపోవని ఆయన వ్యాఖ్యానించారు. తాడిపత్రి ప్రజల కోసం ఎవరితోనైనా పోరాడుతా అని జేసీ ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పారు.
తాజాగా అనంతపురంలో జరిగిన రాయలసీమ టీడీపీ నేతల సమావేశంలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. సీమలో ప్రాజెక్టులకంటే ముందు కార్యకర్తలను కాపాడాలని ఆయన పార్టీ అధిష్టానానికి సలహా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. ఇప్పటి సమావేశానికి అందరికీ ఆహ్వానం లేదన్న ఆయన ఒకరిద్దరు నేతల కనుసన్నల్లో సమావేశం జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబు ఈ విషయాలపై దృష్టి సారించాలన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
అంతేకాదు, ఇప్పుడు ఎన్నికలు వస్తే తెలుగు దేశం పార్టీ మళ్లీ ఓడిపోతుందన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కార్యకర్తలు టీడీపీ నేతలను నమ్మటం లేదన్నారు. చంద్రబాబు మేలుకోకపోతే కష్టమన్నారు. చాలా వరకు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని.. మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.