యురేనియంపై ఫైట్.. బీజేపీ నేతల మౌనం.. అంతుబట్టని వైనం..!
యురేనియం తవ్వకాలపై గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలు అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం చేయాలనుకుంటున్న యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పలువురు గళం విప్పారు. పలు రాజకీయ పార్టీ నేతలతో పాటు సినీ ప్రముఖులు సేవ్ నల్లమల అంటూ అందరికీ పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఆన్లైన్లో సంతకాల సేకరణలో భాగంగా ఎంతోమంది నటీనటులు, వేలాదిమంది సామాన్యులు పిటిషన్పై సంతకం చేశారు. ఇక దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. యురేనియం […]
యురేనియం తవ్వకాలపై గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలు అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం చేయాలనుకుంటున్న యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పలువురు గళం విప్పారు. పలు రాజకీయ పార్టీ నేతలతో పాటు సినీ ప్రముఖులు సేవ్ నల్లమల అంటూ అందరికీ పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఆన్లైన్లో సంతకాల సేకరణలో భాగంగా ఎంతోమంది నటీనటులు, వేలాదిమంది సామాన్యులు పిటిషన్పై సంతకం చేశారు.
ఇక దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. యురేనియం తవ్వకాలకు తమ ప్రభుత్వం అనుమతిని ఇవ్వదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. యురేనియం అనుమతులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటీ అనుమతులు ఇవ్వలేదని, భవిష్యత్లో కూడా అనుమతులు ఇవ్వాలనే ఆలోచన లేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్రంతో పోరాడేందుకు కూడా తాము సిద్ధమని కేసీఆర్ వెల్లడించారు. మరోవైపు యురేనియం తవ్వకాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన తీర్మాణం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.
ఇదిలా ఉంటే మొదట యురేనియం తవ్వకాలకు తెలంగాణ వెలుగులోకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీసుకొచ్చారు. యురేనియం తవ్వకాల వలన పర్యావరణానికి, జీవజాలానికి, ప్రజలకు తీవ్ర నష్టం చేకూరుతుందని ఆ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి, వీహెచ్ సహా పలువురు అందరిలో సామాజిక స్పృహను తీసుకొచ్చారు. దీనికి వివిధ పార్టీ నేతలు కూడా తమ మద్దతును తెలిపారు. అలా పలికిన వారిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఒకరు. దీనిపై త్వరలోనే రాజకీయవేత్తలు, మేధావులు, నిపుణులు, పర్యావరణ ప్రేమికులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని వివరించారు. అయితే ఇంత జరుగుతున్నా తెలంగాణకు చెందిన బీజేపీ కీలక నేతలు ఈ సమస్యపై నోరు విప్పకపోవడం గమనర్హం.
నిజానికి చెప్పాలంటే దేశంలో ఎక్కడైనా ఏదైనా ముడి ఖనిజం ఉందని తేలితే అక్కడ అన్వేషణ చేసే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అటామిక్ మినరల్ డైరక్టరేట్(ఏఎమ్డీ) పర్యవేక్షణలో జరుగుతుంది. ఇక అన్వేషణ తరువాత ఆ ప్రాంతంలో మైనింగ్ చేయాలనుకుంటే దానికి కచ్చితంగా రాష్ట్రప్రభుత్వం ఆమోదం లభించాలి. ఒకవేళ మైనింగ్కు రాష్ట్రప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే.. ఆ తరువాత యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ అక్కడ మైనింగ్ చేపట్టే అవకాశం ఉంటుంది. మొత్తానికి చూసుకుంటే ఏ రాష్ట్రంలోనైనా ఖనిజం మైనింగ్ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతే ఎక్కువగా ఉంటుంది. ఇక ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉండటంతో.. ఈ వివాదంపై రాష్ట్రంలోని బీజేపీ నేతలు తమ గొంతును వినిపించలేదని సమాచారం. ఏది ఏమైనా మైనింగ్కు అనుమతి ఇవ్వమని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ సుస్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పటికైనా యురేనియం ఫైట్కు ఫుల్స్టాప్ పడుతుందేమో చూడాలి.