విశాఖ స్టీల్ కాకరేపుతున్న తరుణంలో జగన్ విశాఖ పర్యటన, సీఎం ఏం చెబుతారన్నదానిపై సర్వత్రా ఆసక్తి
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సాగుతున్న రెండో దశ ఉద్యమం కీలక దశకు చేరింది. అన్ని రాజకీయ పార్టీలు పోరుబాటులో ఉన్నాయి. ప్రైవేటీకరణకు..
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సాగుతున్న రెండో దశ ఉద్యమం కీలక దశకు చేరింది. అన్ని రాజకీయ పార్టీలు పోరుబాటులో ఉన్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీలు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. ఉద్యమం పీక్స్లో ఉన్న టైంలో సీఎం జగన్ విశాఖ టూర్ కాకరేపుతోంది. ఆయన్ని కలిసి ఉద్యమానికి నాయకత్వం వహించాలని అభ్యర్థించనుంది స్టీల్ప్లాంట్ ప్రతినిధుల బృందం. ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని వినతి పత్రం సమర్పించనున్నారు. ఎయిర్పోర్టులోనే ఈ మీటింగ్ జరగనుంది. వాళ్లతో ఆయనేం చెబుతారు… ఎలాంటి సూచనలు చేస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
జగన్ పర్యటనకు ఒక్కరోజు ముందు విశాఖ వెళ్లిన టీడీపీ చీఫ్ చంద్రబాబు… హాట్ కామెంట్స్తో రెచ్చిపోయారు. వైసీపీపై ఒత్తిడి పెంచేలా స్కెచ్ గీశారు. ఉక్కు ఉద్యమానికి జగన్ నాయకత్వం వహించాలని డిమాండ్ చేశారు. భేషజాలు లేకుండా ఆయనకు మద్దతుగా నిలుస్తామని… ఫాలో అవుతామని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కచ్చితంగా ఆయన స్పందించాలనే భావనతో చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు. చంద్రబాబు పర్యటనకు ముందే విశాఖలో భారీ ఆందోళనలు చేపట్టాలని వైసీపీ ప్రకటన చేసేసింది. టీడీపీ కంటే తామే ఈ ఉద్యమంలో ముందు ఉన్నామని సిగ్నల్ ఇచ్చింది. 20న విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో విశాఖ నగరంలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా పాదయాత్ర చేపట్టనున్నారు.
టీడీపీ, వైసీపీ మధ్య జరుగుతున్న వార్ను సీఎం జగన్ టూర్ ఎలాంటి మలుపు తిప్పుతుందోనని అంతా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు ఉద్యమ సెంటిమంట్… మరోవైపు జీవీఎంసీ ఎలక్షన్లు.. దీంతో సీఎం ఎలా రియాక్ట్ అవుతారోనన్న ఉత్కంఠ అటు పార్టీ శ్రేణుల్లోనూ నెలకొంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 11 గంటలకు విశాఖ చేరుకుంటారు. అక్కడే సీఎం వైఎస్ జగన్ను విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతినిధి బృందం కలవనుంది. ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని వినతి పత్రం సమర్పించనుంది. 11.30 గంటల నుంచి 12.30 గంటల మధ్య పెందుర్తి మండలం చినముషిడివాడలో విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవం తొలి రోజు కార్యక్రమంలో పాల్గొంటారు.
పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిల ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. సీఎం జగన్ స్వామీజీలతో కలిసి గోపూజ, శమీవృక్షం ప్రదక్షిణ చేస్తారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.