స్వేచ్ఛాయుత వాతావరంణలో ఎన్నికలకు ఏర్పాట్లు.. పోలీసుల ఇబ్బందులను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్న గౌతమ్ సవాంగ్
ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బందిలో.. ఆరోగ్య సమస్యలున్నవారి విషయంలో మినహాయింపులపై ఆలోచిస్తున్నామన్న డీజీపీ గౌతమ్..
ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు, వ్యాక్సినేషన్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ ఆదిత్యనాథ్, డీజీపీ గౌతం సవాంగ్ ఇతర శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు.
ఎన్నికలు, వ్యాక్సినేషన్ రెండూ ఒకేసారి రావటం వల్ల.. పోలీసులకు కలిగే ఇబ్బందులను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లామని గౌతమ్ సవాంగ్ తెలిపారు. వ్యాక్సినేషన్కు ఇబ్బంది రాకుండా.. ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచన చేస్తున్నామన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బందిలో.. ఆరోగ్య సమస్యలున్నవారి విషయంలో మినహాయింపులపై ఆలోచిస్తున్నామన్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియపై 13 జిల్లాల ఎస్పీలు.. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించామని గౌతమ్ సవాంగ్ తెలిపారు.