Eluru Corporation Election: ఏలూరు కార్పొరేషన్ కౌంటింగ్ ఎప్పుడు? కార్పొరేషన్ అభ్యర్థుల్లో నరాలు తెగే టెన్షన్
ఏలూరు కార్పొరేషన్ కౌంటింగ్ ఎప్పుడు? అసలు జరుగుతుందా.. లేదంటే మళ్లీ మొదట్నించీ ఎన్నికల ప్రక్రియ ఉంటుందా? హైకోర్టు ఏం తేలుస్తుందోనని..ఏలూరు కార్పొరేషన్ అభ్యర్థుల్లో నరాలు తెగే టెన్షన్.
Eluru Corporation: ఏలూరు కార్పొరేషన్ ఎన్నిక రాజకీయవర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. నగరపాలకసంస్థ పరిధిలోని ఏడు గ్రామాల విలీనం వివాదాస్పదంగా మారటంతో చివరికి ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. పంచాయతీల పాలకవర్గాలు లేని సమయంలో ప్రజాభిప్రాయాన్ని స్వీకరించకుండా స్పెషల్ ఆఫీసర్లు తీర్మానాలు చేయటాన్ని కొందరు వ్యతిరేకించారు.
దీంతో పాటు డివిజన్ల విభజన, రిజర్వేషన్ల కేటాయింపు సరిగా జరగలేదంటూ ఆయా గ్రామాల వారు కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలపై స్టే విధించింది. స్టే అమలులో ఉండగానే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయటంతో.. బాధితులు కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. దీంతో పోలింగ్ తేదీకి రెండు రోజుల ముందు..ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ నిలిపివేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం డివిజన్ బెంచ్కు వెళ్లటంతో.. ఎన్నికలు నిర్వహించినా కేసు తేలేదాకా కౌంటింగ్ నిర్వహించవద్దని సూచిస్తూ కేసు విచారణని ఈనెల 23కి వాయిదా వేసింది. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో 2లక్షల 32వేల 378 మంది ఓటర్లుంటే…అందులో లక్షా 32వేల 478 మంది మాత్రమే ఓటేశారు. సాంకేతిక కారణాలతో డిప్యూటి సీఎం ఆళ్ల నాని కూడా ఓటు హక్కు వినియోగించుకోలేకపోవటంతో ప్రతిపక్షాల వాదనకు మరింత బలం చేకూరింది.
మరోవైపు భారీగా ఓట్ల గల్లంతుకు అధికారుల వైఫల్యమే కారణమంటోంది జనసేన. ఈ విషయాలన్నీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లేందుకు జనసేన నేతలు సిద్ధమయ్యారు. ఏలూరు కార్పొరేషన్లో కేవలం 56.82 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. విలీన గ్రామాల ప్రజలను 50 డివిజన్లలో సర్దుబాటు చేయటంలో అధికారయంత్రాంగం విఫలమైందంటున్నారు జనసేన నేతలు.
కోర్టు ఉత్తర్వులను బట్టి తమ న్యాయపోరాటం ఉంటుందంటున్నారు జనసేన ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు. అన్ని రాజకీయపక్షాలతో పాటు కార్పొరేషన్ పరిధిలోని ప్రజలంతా కోర్టు నిర్ణయంకోసం ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే మంగళవారం కోర్టులో వాదనలు జరుగుతాయా… లేకుంటే కేసు వాయిదా పడుతుందా అనే టెన్షన్ అందరిలో కనిపిస్తోంది.