నెక్స్ట్ లెవెల్కు రాజధాని రగడ.. తాజా వాదనేంటంటే ?
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మెలికపెడితే, టీడీపీ నేతలు ఛలో అమరావతి అంటూ తమ ప్రోగ్రెస్ రిపోర్టును చూపించారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనీ, నిర్మాణాలు లేవని ఆరోపణలు చేస్తున్న అధికారపక్షానికి కౌంటర్ ఇచ్చారు. తమతోపాటు వస్తే అమరావతిని చూపిస్తామనీ ఛాలెంజ్ చేస్తున్నారు. అసలు అమరావతి ఎక్కడ ఉందంటూ వైసీపీ కౌంటర్ ఇస్తోంది. అమరావతిపై ప్రశ్నలు సంధిస్తున్న టీడీపీ నేతలను వైసీపీ చెడ్డీగ్యాంగ్ అంటూ పోల్చుతోంది. రాజధానిపై వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన మధ్య […]
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మెలికపెడితే, టీడీపీ నేతలు ఛలో అమరావతి అంటూ తమ ప్రోగ్రెస్ రిపోర్టును చూపించారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనీ, నిర్మాణాలు లేవని ఆరోపణలు చేస్తున్న అధికారపక్షానికి కౌంటర్ ఇచ్చారు. తమతోపాటు వస్తే అమరావతిని చూపిస్తామనీ ఛాలెంజ్ చేస్తున్నారు. అసలు అమరావతి ఎక్కడ ఉందంటూ వైసీపీ కౌంటర్ ఇస్తోంది. అమరావతిపై ప్రశ్నలు సంధిస్తున్న టీడీపీ నేతలను వైసీపీ చెడ్డీగ్యాంగ్ అంటూ పోల్చుతోంది. రాజధానిపై వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన మధ్య సాగుతున్న పంచాయితీ బుధవారం పరిణామాలతో నెక్స్ట్ లెవెల్కు చేరినట్లయింది.
అమరావతిపై పీటర్ కమిటీ నివేదిక, నిపుణుల ఏర్పాటుతో రాజధానిని తరలిస్తారనే అనుమానాల మధ్య ప్రతిపక్షం తన దాడిని పెంచింది. అమరావతిపై గెజిట్ నోటిఫికేషన్ లేదనీ, దేశచిత్రపటంలో అమరావతికి చోటులేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు టిడిపి నేతల్లో కాక పెంచాయి. ఈ సందర్భంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్- వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు. రాజధానిని పులివెందులలో ఏర్పాటు చేసి, అక్కడికి దగ్గరలోనే ఉన్న కర్నూలులో హైకోర్టు నిర్మించాలని పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
ఇదే సందర్భంలో అమరావతికి టీడీపీ నేతలు బస్సుయాత్ర చేపట్టారు. బుధవారం కరకట్ట మీద మొదలైన టిడిపి రాజకీయం కోర్ కేపిటల్ ఏరియా సందర్శన దాకా కొనసాగింది. అమరావతిలో ఏమీ కట్టలేదని అంటున్న మంత్రి బొత్స సత్యనారాయణకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు టిడిపి నేతలు. 16వేల అపార్ట్మెంట్లు 60 నుంచి 90 శాతం వరకు పూర్తయ్యాయని టీడీపీ వాదిస్తోంది. బొత్స తమతోపాటు కారులో వస్తే అన్నీ చూపిస్తామంటున్నారు తెలుగుతమ్ముళ్లు.
అమరావతి ఓ భ్రమరావతి అంటున్న వైసీపీ తమ ఎదురుదాడికి మరింత పదునుపెట్టింది. టీడీపీ చూపిన నమూనాలు అమరావతిలో ఎక్కడున్నాయని ఆ పార్టీ నేతలు నిలదీస్తున్నారు. అసలు రాజధానికి నోటిఫికేషనే లేదని, గత ఐదేళ్లలో నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తోంది వైసీపీ.
అమరావతి రగడ నడుస్తుండగానే- కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై రాయలసీమ భగ్గుమంటోంది.
కర్నూలులో న్యాయవాదులు పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మకు ఊరేగింపు చేశారు. రాయలసీమను కించపరిస్తే పవన్ కల్యాణ్ను రాయలసీమలో తిరగనీయబోమని న్యాయవాది గోరంట్ల రామాంజనేయులు హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో అటు రాజధాని, ఇటు హైకోర్టు అంశం ఏపీలో రాజకీయ మంటలను పుట్టిస్తున్నాయి.