Lamba Investigation : ఆన్లైన్ లోన్ యాప్ మనీ దందా వెనుక ఓ మహిళ.. తీగ లాగుతున్న సైబర్క్రైమ్ పోలీసులు
ఆన్లైన్ లోన్ యాప్స్ వ్యవహారంలో కీలక వివరాలను రాబడుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. 27 వేలకోట్ల చైనా స్కాం కేసులో తమదైన తరహాలో విచారణ చేస్తున్నారు. ప్రధాన నిందితులు లాంబా, నాగరాజుల నాలుగురోజుల కస్టడీ పూర్తి...
ఆన్లైన్ లోన్ యాప్స్ వ్యవహారంలో కీలక వివరాలను రాబడుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. 27 వేలకోట్ల చైనా స్కాం కేసులో తమదైన తరహాలో విచారణ చేస్తున్నారు. ప్రధాన నిందితులు లాంబా, నాగరాజుల నాలుగురోజుల కస్టడీ పూర్తి అయ్యింది. ఈ విచారణలో పలు కీలక విషయాలు బయటికి రావడంతో … కస్టడీ పొడిగించాలని సైబర్క్రైమ్ పోలీసులు మరోసారి కోర్టులో పిటిషన్ వేసి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
నాలుగురోజుల కస్టడీలో లాంబా అనేక కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. కంపెనీకి చెందిన లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని లాంబా తెలిపినట్టు సమాచారం. ఆర్థిక లావాదేవీల కోసం ప్రత్యేక టీమ్ ఉంటుందని పోలీసులకు వెల్లడించారు. సీసీఎస్లో మొదటిసారి కేసు నమోదు అయిన వెంటనే తన వద్ద ఉన్న కీలక డేటాను డిలీట్ చేసినట్టు లాంబా విచారణలో వెల్లడించాడు. డిలీట్ చేసిన కీలక సమాచారాన్ని పోలీసులు రికవరీ చేసే పనిలో పడ్డారు.
లాంబా విచారణలో మరికొన్ని యాప్లను కూడా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. నిందితులను మరికొన్ని రోజులు కస్టడీకి ఇస్తే.. మరింత కీలక సమాచారాన్ని సేకరిస్తామని పోలీసులు కోర్టుకు తెలిపారు. కీలక ఆర్ధిక లావాదేవీలు చైనా దేశానికి చెందిన క్యూయుయున్ అనే మహిళ చేస్తున్నట్లు లాంబా ఇచ్చిన సమాచారం ఆధారంగా గుర్తించారు. ఈమె సిసి జెన్నిఫర్ అనే నకిలీ పేరుతో ఇండియాకి వచ్చి వెళ్లేదని పోలీసుల విచారణలో తేలింది.