ప్రధాని మోదీ చేతుల మీదుగా కిసాన్ సూర్యోదయ యోజన ప్రారంభం
గుజరాత్ రాష్ట్రంలో కిసాన్ సూర్యోదయ యోజనతో పాటు మూడు ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించనున్నారు.
గుజరాత్ రాష్ట్రంలో కిసాన్ సూర్యోదయ యోజనతో పాటు మూడు ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రంలో రైతులకు తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగు అవసరాలకు నీటిని అందించేందుకు వీలుగా విద్యుత్ సరఫరాకు గాను కిసాన్ సూర్యోదయ యోజన పథకం అమలు చేస్తామని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ప్రకటించారు. ఇందుకోసం గుజరాత్ ప్రభుత్వం రూ.3,500 కోట్లతో కూడిన ఈ పథకాన్ని తీసుకువచ్చింది.
అలాగే, అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ పిడియాట్రిక్ హార్ట్ హాస్పిటల్, టెలీ కార్డియాలజీ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించారు. రూ.470 కోట్ల వ్యయంతో హాస్పిటల్ను 450 పడకల నుంచి 1251 పడకలకు విస్తరిస్తున్నారు. దేశంలో అతిపెద్ద సింగిల్ సూపర్ స్పెషాలిటీ కార్డియాక్ టీచింగ్ ఇనిస్టిట్యూట్గా, ప్రపంచంలోనే అతి పెద్ద సింగిల్ సూపర్ స్పెషాలిటీ కార్డియాక్ హాస్పిటల్గా ఇది నిలువనుంది. వీటితోపాటు ప్రధాని గిర్నార్ రోప్ వేను ప్రారంభించారు.