సీఎంలతో మరోసారి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్.. ఈ సారి 2 రోజులు, 2 గ్రూపులు
దేశంలో వైరస్ వ్యాప్తి శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మళ్లీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అయితే, ఈ సారి దేశంలోని అందరూ ముఖ్యమంత్రులను రెండు టీమ్లుగా విభజించి..
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశం మొత్తం కరోనా కేసుల సంఖ్య 3 లక్షలను దాటగా..మహారాష్ట్రలో శుక్రవారం నమోదైన 3,493 కరోనా కేసులతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,01,141ని చేరింది. అలాగే పశ్చిమబెంగాల్లో శుక్రవారం 476 కరోనా కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 10 వేల మార్కును దాటింది. అటు తమిళనాడులో శుక్రవారం రాత్రి వరకు 1982 కేసులు నమోదు కావడంతో తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 40,698ని చేరింది. దేశంలో వైరస్ వ్యాప్తి శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మళ్లీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
దేశంలో చేయిదాటి పోతున్న కరోనా కేసులు, వాటి నియంత్రణ, లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత ఎదురవుతున్న పరిస్థితులు వంటి అంశాలపై మోదీ సీఎంలతో చర్చించనున్నట్లు సమాచారం. జూన్ 16, 17 తేదీల్లో అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల సీఎంలతో కరోనా వైరస్పై సమీక్ష నిర్వహించనున్నారు. అయితే, ఈ సారి దేశంలోని అందరూ ముఖ్యమంత్రులను రెండు టీమ్లుగా విభజించి ప్రధాని మోదీ వేర్వేరుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
ఒక్కో గ్రూప్తో ఒక్కోరోజు కరోనా కట్టడి చర్చలు జరుపుతారని సమాచారం. కరోనా కట్టడి, అన్లాక్ 1పై ముఖ్యమంత్రుల నుంచి వివరాలు తెలుసుకోనున్నారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తదుపరి ఎలా ముందుకెళ్లాలన్న దానిపై వారి సలహాలు సూచనలు స్వీకరించనున్నారు. 16న నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో ఏపీ ముఖ్యమంత్రి, 17వ తేదీ జరిగే సమావేశంలో తెలంగాణ సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.