కేరళ.. గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. ప్రధాని మోదీ శరణు జొచ్చిన సీఎం పినరయి విజయన్
కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ కేసు రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రభుత్వానికి గండం తెచ్చేలా కనిపిస్తోంది. తన రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబడుతుండడంతో ఆయన ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. తిరువనంతపురం విమానాశ్రయంలో 30 కేజీల గోల్డ్ పట్టివేతపై..
కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ కేసు రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రభుత్వానికి గండం తెచ్చేలా కనిపిస్తోంది. తన రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబడుతుండడంతో ఆయన ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. తిరువనంతపురం విమానాశ్రయంలో 30 కేజీల గోల్డ్ పట్టివేతపై సమగ్ర దర్యాప్తు జరిగేలా.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన ఈ లేఖలో ప్రధానిని కోరారు. ఈ కేసు దేశ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూప గలదన్నారు. ‘డిప్లొమాట్ బ్యాగేజీ’ లో పెద్ద మొత్తంలో దాచిన బంగారాన్ని స్మగుల్ చేయడానికి జరిగిన యత్నం అతి తీవ్రమైనదని విజయన్ అన్నారు. కస్టమ్స్ అధికారులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారని, ఈ వ్యవహారంలో ఎన్నో కోణాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర స్థాయిలో జరిగే దర్యాప్తునకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. అయితే కేంద్ర సహాయ మంత్రి వి.మురళీధరన్ ఈ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంపై స్పందిస్తూ.. దీన్ని డిప్లొమాటిక్ బ్యాగేజీ అనలేమన్నారు. ఇది ఒక దౌత్యాధికారి వచ్చిన ‘కార్గో’ అని, డిప్లొమాటిక్ బ్యాగేజీ అంటే ఏ దేశం నుంచి అయినా అధికారికంగా పంపే బ్యాగేజీ అన్నారు. దీన్ని అందుకోవడానికి వఛ్చిన వ్యక్తి వద్ద అవసరమైన పత్రాలు లేవన్నారు. అయితే దీనిపై కేంద్రం దర్యాప్తు చేస్తుందని, దోషులను వదలబోమని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి కార్యాలయం కూడా తన తప్పిదమేమీ లేదని నిరూపించుకోవాల్సి ఉందని, ఐటీ శాఖలో పని చేసిన ఓ మాజీ ఉద్యోగిని (స్వప్న సురేష్) ఈ కేసులో నిందితురాలని తెలుస్తోందని మురళీధరన్ అన్నారు. కేరళ ప్రభుత్వం నిర్వహించిన ప్రధాన కార్యక్రమాల్లో ఆమె పాల్గొందని ఆయన చెప్పారు. ఇలాంటప్పుడు తన బాధ్యత లేదని ముఖ్యమంత్రి ఎలా చెప్పగలుగుతారని ఆయన ప్రశ్నించారు. నిందితురాలిని రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అయితే ఈ కేసులో ఓ నిందితుడు బీజేపీ కార్యకర్త అని కేరళ పరిశ్రమల శాఖ మంత్రి జయరాజన్ ఆరోపించారు. సందీప్ నాయర్ అనే ఆ కార్యకర్త పరారీలో ఉన్నాడని పేర్కోన్నారు. ఇలా ఉండగా.. ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అనే కన్సల్టింగ్ ఏజన్సీ స్వప్న సురేష్ ని అపాయింట్ చేసినట్టు కస్టమ్స్ వారి దర్యాప్తులో తెలిసింది. కానీ ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులూ లేవని ఈ సంస్థ స్పష్టం చేసింది.