“ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం లేదు”
ఎమ్మెల్సీ పదవికి పముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేశారు. మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్సీ పదవికి ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేశారు. మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్యెల్సీ పదవికి సంబంధించి మండలి కార్యదర్శికి రాజీనామా లేఖ ఇచ్చారు. మంత్రి పదవికి సంబంధించి సీఎం జగన్ కు రాజీనామా పత్రం అందిస్తానని వెల్లడించారు. ఈనెల 19న ఆయన రాజ్యసభకు ఎన్నికయిన విషయం తెలిసిందే. దీంతో శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
కాగా మంత్రిగా ఏడాది కాలం సంతృప్తిగా పని చేశానని సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు సీఎం పూర్తి స్వేచ్ఛనిచ్చారని..ఏ రోజు తన వ్యవహారాల్లో ఆయన కల్పించుకోలేదని వెల్లడించారు. పార్లమెంటుకు వెళ్లాలన్నది తన చిరకాల కోరికని వెల్లడించిన సుభాష్ చంద్రబోస్ .. సిఎం జగన్ తనకు ఆ గోల్డన్ ఆపర్చునిటీ ఇచ్చారని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ సుదీర్ఘ పోరాటం చేశారని.. అయితే హోదా వస్తుందని తనకు నమ్మకం లేదన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు వ్యవహారంపై స్పందిస్తూ.. ఎంపీలు ఎవరైనా గెలిచిన పార్టీకి విధేయులుగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత అభిప్రాయం ఎలా ఉన్నా.. పార్టీ నిర్ణయాన్ని ఎవరైనా శిరోధార్యంగా భావించాలని తెలిపారు.