ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం.. ఇకపై సచివాలయాల్లోనూ ఇసుక బుకింగ్..!
ఇసుక విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయ పరిధిలో ఎవరికైనా ఇసుక కావాలనుకుంటే
ఇసుక విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయ పరిధిలో ఎవరికైనా ఇసుక కావాలనుకుంటే ఆ గ్రామ సచివాలయంలోనే బుక్ చేసుకోవచ్చునని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ప్రజా ప్రతినిధులు, మైనింగ్ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక బుకింగ్కు సంబంధించిన వెబ్సైట్.. 5 నిమిషాల్లోనే క్లోజ్ అవుతున్నట్లు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇసుక బుకింగ్ ప్రక్రియను ఏపీఎండీసీ నుంచి గ్రామ సచివాలయాలకు అనుసంధానం చేస్తున్నామని అన్నారు. ఇకపై ఇసుక బుకింగ్ గ్రామ సచివాలయంలోనే చేసుకోవచ్చునని తెలిపారు.
గ్రామ సచివాలయంలో వచ్చిన డిమాండ్ను బట్టి ఏపీఎండీసీ అధికారులు చర్యలు తీసుకుంటారని మంత్రి పేర్కొన్నారు. ఈ పద్ధతి ద్వారా వినియోగదారులకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఒకే ఆధార్ కార్డుతో వందలాది మంది ఇసుకను తీసుకుంటున్నారని.. ఇసుక దుర్వినియోగం కాకుండా సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నామని పెద్దిరెడ్డి వెల్లడించారు. ఇక ఇసుక యాడ్ నుంచి 10 కిలోమీటర్లలోపే స్టాక్ పాయింట్ ఉంచాలని నిర్ణయించామని.. దీని వలన వినియోగదారులకు ట్రాన్స్పోర్టు ఖర్చులు తగ్గుతాయని అన్నారు. వీటన్నింటిపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడి త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
Read This Story Also: కుల వివాదం.. 35 కత్తి పోట్లతో యువకుడి దారుణ హత్య..!