అంతర్వేది ఘటన: సమస్య పరిష్కారం అయినట్టు కాదు.. ‘సీబీఐ’ దర్యాప్తుపై పవన్
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి
Pawan Kalyan News: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్కి ఆయన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విపక్షాలు స్వాగతిస్తున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఇది ఏపీ ప్రభుత్వం వేసిన తొలి అడుగు మాత్రమేనని, సీబీఐ దర్యాప్తుకు కోరినంత మాత్రాన సమస్య పరిష్కారం అయినట్లు కాదని పేర్కొన్నారు. నిందితుల్ని పట్టుకోవడానికి వేసిన తొలి అడుగు అని గ్రహించాలని తెలిపారు.
ఇక అంతర్వేది రథం దగ్ధం ఘటన సీబీఐకే పరిమితం కారాదని, పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం, కొండబిట్రగుంట రథం దగ్ధం వెనుక ఎవరు ఉన్నారో సిబిఐ నిగ్గు తేల్చాలని అన్నారు. ఈ మూడు దుశ్చర్యలూ ఒకేలా ఉన్నాయని, అందుకే పిఠాపురం కొండ బిట్రగుంటల్లోని ఘటనల్నీ సీబీఐ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న అంతర్వేది ఆలయ భూములు అన్యాక్రాంతమైపోయాయని పవన్ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు ధర్మసత్రాల ఆస్తులు అన్యులపరమైపోయాయని, వీటి గురించి సీబీఐ ఆరా తీసి ఎండోమెంట్స్ ఆస్తులకు రక్షణ ఇవ్వాలని పవన్ అన్నారు. వీటితో పాటు తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ గురించి సీబీఐ ఆరా తీయాలని.. ఆ పింక్ డైమండ్ ఏమైపోయినదనే అంశంపై రమణ దీక్షితులు గత ప్రభుత్వ హయాంలోనే సంచలన విషయాలు చెప్పారని గుర్తు చేశారు. ఆ వజ్రం ఎటుపోయిందో ఆరా తీయాలని అన్నారు. అలాగే తిరుమల శ్రీవారికి శ్రీకృష్ణ దేవరాయలవారు ఇచ్చిన ఆభరణాల గురించి ఆరా తీయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
Read More: