మరోసారి గాంధీ డాక్టర్లపై దాడి
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలోని జూనియర్ వైద్యుడిపై రోగి తరఫు బంధువులు దాడి చేశారు.
క్లిష్టమైన సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లపై దాడి ఘటన మరోసారి తీవ్ర కలకలం సృష్టించింది. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్స్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. గాంధీ ఆస్పత్రిలోని జూనియర్ వైద్యుడిపై రోగి తరఫు బంధువులు దాడి చేశారు. కరోనా బారిన పడి గాంధీలో చికిత్స పొందుతూ ఇవాళ రోగి ఒకరు మృతి చెందారు. దీంతో మృతుని బంధువులు ఆగ్రహంతో దాడికి దిగారు. ఆస్పత్రిలోని ఫర్నీచర్ను ధ్వంసం చేసి, ఇనుప కుర్చీలతో జూనియర్ వైద్యుడిపై దాడి చేశారు. ఈ దాడిలో వైద్యుడు స్వల్పంగా గాయపడ్డాడు. రోగులకు వైద్య సేవలు అందిస్తున్న తమపై దాడి చేయడం ఏంటంటూ వైద్యులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు వైద్యులు.