ఫాంహౌస్లో మద్దతుదారులతో పన్నీర్సెల్వం రహస్య భేటీ
తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన ఇద్దరు నేతలు వేరువేరుగా రహస్య మంతనాలతో క్యాంపు రాజకీయాలకు మరోసారి తెర లేపారు.
తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన ఇద్దరు నేతలు వేరువేరుగా రహస్య మంతనాలతో క్యాంపు రాజకీయాలకు మరోసారి తెర లేపారు. ఎంజీఆర్ కాలం నుండి ఇప్పటిదాకా పార్టీకి విశ్వాసపాత్రులుగా ఉంటున్న అన్నాడీఎంకే శ్రేణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అన్నాడీఎంకేలో ఇలాంటి పరిస్థితులు మునుపెన్నడూ లేవని పార్టీ కార్యకర్తలు బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఎంజీఆర్, జయలలిత హయంలో మిలటరీ అధికారుల సమావేశంలా జరిగే కార్యనిర్వాహక కమిటీ సమావేశం ఇంత రసాభాసగా జరగడం ఇదే తొలిసారి అంటున్నారు. తన జీవితాన్నే పణంగా పెట్టి అమ్మ కాపాడిన పార్టీ పరువును ఇలా బజారుకు ఇడుస్తున్నారంటూ పార్టీని అంటిపెట్టుకుని ఉంటున్న సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు పార్టీని కాపాడేందుకు శశికళ రావాలంటూ పిలుపునిస్తున్నారు. మరోవైపు ఎడప్పాడికి వంతపాడుతూ ఇద్దరు మంత్రులు పార్టీలో అయోమయం సృష్టిస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో అన్నాడీఎంకే గతి ఏమవుతోందనని కార్యకర్తలంతా ఆందోళన చెందుతున్నారు.
కాగా, కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయమై అధికార అన్నాడీఎంకేలో తీవ్రస్థాయిలో వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి ఒ. పన్నీర్సెల్వం తన మద్దతుదారులతో రహస్య మంతనాలు జరుపుతున్నారు. పెరియకుళంలోని తన ఫాంహౌస్లో ఆయన మద్దతులతో భేటీ అయ్యారు. పన్నీర్సెల్వం శుక్రవారం సాయంత్రం చెన్నై నుంచి తన స్వస్థలమైన పెరియకుళంకు వెళ్లారు. రాజకీయాలు రసవత్తంగా మారిన సమయంలో పన్నీర్సెల్వం సొంతూరు చేరడంపై అనుమానాలు వెల్లవెత్తాయి. అయితే, పన్నీర్సెల్వం తన మనవడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకే పెరియకుళం వచ్చారని, రాజకీయాలు గురించి మాట్లాడేందుకు ఆయన ఇష్టపడటం లేదని ఆయన బంధువులు మీడియా ప్రతినిధులకు తెలిపారు. ఇదిలావుంటే, శనివారం ఉదయం 10 గంటల తర్వాత పన్నీర్సెల్వం కారులో కైలాసపట్టిలోని తన ఫాంహౌస్ చేరుకున్నారు. అప్పటికే మాజీ మంత్రి నత్తం విశ్వనాధన్, తేని, దిండుగల్, మదురై జిల్లాలకు చెందిన పన్నీర్సెల్వం మద్దతుదారులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అందరిని తన ఫాంహౌస్ లోకి తీసుకెళ్ళిన పన్నీర్సెల్వం వారితో చర్చలు జరిపినట్లు సమాచారం. కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై తన మద్దతుదారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కాగా, పన్నీర్సెల్వం చెన్నై చేరుకున్నాక తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు.