రాజ్కపూర్, దిలీప్కుమార్ల ఇళ్లను వారసత్వ సంపదగా గుర్తించిన పాక్ ప్రభుత్వం
అవిభాజ్య భారతదేశం రెండు ముక్కలు కావడం పెను విషాదం.. మానవకారక ఆ విపత్తు లక్షలాది మందిని బలి తీసుకుంది.. అప్పుడు ఏర్పడిన పాకిస్తాన్ నుంచి ఎంతో మంది భారత్కు వలసవచ్చారు..
అవిభాజ్య భారతదేశం రెండు ముక్కలు కావడం పెను విషాదం.. మానవకారక ఆ విపత్తు లక్షలాది మందిని బలి తీసుకుంది.. అప్పుడు ఏర్పడిన పాకిస్తాన్ నుంచి ఎంతో మంది భారత్కు వలసవచ్చారు.. ఇక్కడి నుంచి కూడా కొందరు అక్కడికి వెళ్లారు.. కన్నచోటును, ఉన్నచోటును వదిలిరావడం బాధాకరమే! అది కూడా కట్టుబట్టలతో! ఇలా ఇక్కడి నుంచి వెళ్లినవారి నివాసాలు ఎన్నో కాలగర్భంలో కలిసిపోయాయి.. అలాగే అక్కడి నుంచి వచ్చినవారి భవంతులు కూడా చాలా మట్టుకు శిథిలావస్థకు చేరుకున్నాయి.. సుప్రసిద్ధుల ఇళ్లు కొన్ని గతస్మృతులకు చిహ్నాలుగా మిగిలి ఉన్నాయి.. హిందీ చిత్రసీమను ఏలిన పృథ్వీ రాజ్కపూర్, దిలీప్కుమార్ల పూర్వీకుల ఇళ్లు అక్కడే ఉన్నాయి.. వాటిని కూల్చివేసి కాంప్లెక్స్ కట్టాలన్న ప్రయత్నాలకు పాక్ ప్రభుత్వం బ్రేక్ వేసింది.. ఖైబర్ ఫఖ్తున్వాలో ఉన్న ఈ భవంతులను భద్రపరచాలని నిర్ణయించింది అక్కడి తాత్కాలిక ప్రభుత్వం. కొద్దిగా శిథిలావస్థకు చేరుకున్న ఈ భవంతులకు మరమత్తులు చేసి భవిష్యతరాలకు వాటి గొప్పదనాన్ని తెలియచేయాలనుకుంటోంది.. చారిత్రక ప్రాధాన్యం గల వీటిని కూల్చివేయకుండా.. వారసత్వ సంపదగా గుర్తించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ఖైబర్ పఖ్తున్వా పురావస్తు శాఖ ఈ రెండు భవనాలను కొనుగోలు చేయాలనుకుంటోంది. పెషావర్ నగరం నడిబొడ్డున ఉన్న ఈ భవంతుల ధరను నిర్ణయించడానికి డిప్యూటీ కమిషనర్కు ఉత్తరం కూడా రాసింది పురావస్తుశాఖ. రాజ్ కపూర్ పూర్వీకుల నివాసాన్ని కపూర్ హవేలీ అని పిలుస్తారు. ఇది కిస్సా ఖ్వానీ బజార్లో ఉంది. దీనిని 1918-22 మధ్య కాలంలో పృథ్విరాజ్కపూర్ తండ్రి దేవాన్ బాషేశ్వర్నాథ్ కపూర్ కట్టారు. పృథ్విరాజ్కపూర్ ముగ్గురు తనయులు ఆ భవంతిలోనే కళ్లు తెరిచారు. రాజకపూర్ మేనమామ త్రిలోక్కపూర్ పుట్టింది కూడా ఇక్కడే! ఇక దిలీప్కుమార్ (మహ్మద్ యూసఫ్ఖాన్) పూర్వీకులకు చెందిన భవంతి కూడా అక్కడే ఉంది.. ప్రస్తుతం ఇది కూడా పాడుపడింది.. 2014 లో అప్పటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం దీనిని జాతీయ వారసత్వంగా ప్రకటించింది. రెండు భవనాల యజమానులు గతంలో వీటిని పడగొట్టి కమర్షియల్ ప్లాజాలను నిర్మించాలనుకున్నారు. అయితే చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఆ భవంతులను రక్షించాలని పురావస్తు శాఖ నిర్ణయించింది. ఆ భవంతుల యజమానులకు కూడా కమర్షియల్ కాంప్లెక్స్లను కట్టడం ఇష్టం లేదు.. కపూర్ హవేలీ యజమాని అలీ ఖాదర్ ఈ మాటే అన్నారు.. తనకు కూడా భవనం కూల్చివేయడం ఇష్టం లేదని, దేశ గౌరవానికి గుర్తుగా ఉన్న ఈ ఇంటిని పరిరక్షించాలని పురావస్తుశాఖకు ఎన్నోసార్లు విన్నవించుకున్నానని తెలిపారు. రిషికపూర్కు పాకిస్తాన్కు వెళ్లి తన పూర్వీకుల భవంతిని చూడాలని ఎంతగానో ఉండేది.. ఆ కోరిక తీరకుండానే ఆయన చనిపోయారు. తమ పూర్వీకుల ఇంటిని మ్యూజియంగా మార్చమంటూ రిషికపూర్ పాకిస్తాన్ ప్రభుత్వానికి ఓ రిక్వెస్ట్ చేశారు.. పాక్ ప్రభుత్వం కూడా అంగీకరించింది కానీ ఆ భవంతి ఇప్పటి వరకు మ్యూజియంగా మారలేదు..