పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారీ షాక్…కోర్టు నోటీసులు
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు పీఎంఎల్-ఎన్ పార్టీ ప్రెసిడెంట్ షహ్బాజ్ షరీఫ్ 2017లో వేసిన ఓ పరువు నష్టం దావా కేసులో ఇమ్రాన్ నోటీసులు అందుకున్నట్లు అధికారులు తెలిపారు.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి ఓ కోర్టు శనివారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు పీఎంఎల్-ఎన్ పార్టీ ప్రెసిడెంట్ షహ్బాజ్ షరీఫ్ 2017లో వేసిన ఓ పరువు నష్టం దావా కేసులో ఇమ్రాన్ నోటీసులు అందుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇమ్రాన్ ఓ సభలో మాట్లాడుతూ.. పనామా పేపర్ల స్కాములో చిక్కుకున్న నవాజ్పై నమోదు చేసిన కేసును వెనక్కి తీసుకోవాలని కోరుతూ షహ్బాజ్ తనకు 61 మిలియన్ డాలర్లు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అవన్నీ వట్టి కట్టుకథలని తెలిపిన షహ్బాజ్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఇప్పటికే 60 సార్లు వాదనలు వినగా.. ఇమ్రాన్ ఖాన్ 33 సార్లు వాయిదా కోరారు. పలుసార్లు లాయర్ల ద్వారా కోర్టుకు తన వెర్షన్ వినిపించారు ఇమ్రాన్. కానీ, ఇప్పటి వరకు ఆయన స్వయంగా రాతపూర్వకంగా సమాధానం చెప్పలేదు. దీంతో ఈసారి తప్పకుండా కోర్టుకు లిఖితపూర్వక ఆన్సర్ చెప్పాలని జడ్జి ఆదేశించారు. దీనిపై పీఎంఎల్-ఎన్ పార్టీ స్పోక్ పర్సన్ మరియం మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్ సమాధానం ఇవ్వని పక్షంలో ఆర్టికల్ 62, 63 ప్రకారం ప్రధాని పదవికి అనర్హులవుతారని వెల్లడించారు.