పుల్వామాపై నాలుక మడతేసిన పాకిస్తాన్‌ మంత్రి

ఇప్పుడు మనం క్షణక్షణముల్‌ పాకిస్తాన్‌ చిత్తముల్‌ అని అనుకోవాలి.. ఎందుకంటే నిన్ననే కదా పుల్వామా ఉగ్రదాడి తమ పనే అని చెప్పింది.. ఇవాళేమో .. అబ్బే ఆ దాడికి తమకు ఎలాంటి సంబంధమూ లేదంటోంది..

పుల్వామాపై నాలుక మడతేసిన పాకిస్తాన్‌ మంత్రి
Follow us

|

Updated on: Oct 30, 2020 | 1:49 PM

ఇప్పుడు మనం క్షణక్షణముల్‌ పాకిస్తాన్‌ చిత్తముల్‌ అని అనుకోవాలి.. ఎందుకంటే నిన్ననే కదా పుల్వామా ఉగ్రదాడి తమ పనే అని చెప్పింది.. ఇవాళేమో .. అబ్బే ఆ దాడికి తమకు ఎలాంటి సంబంధమూ లేదంటోంది.. ఏమిటో ఇలా జంకుబొంకు లేకుండా మాట్లాడటం పాకిస్తాన్‌కే చెల్లుతుంది. అసలు జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని, తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని అంటున్నారు ఆ దేశ శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి ఫవాద్‌ ఛౌదురి.. పుల్వామా దాడి అనంతర పరిస్థితుల గురించే తాను మాట్లాడనని ఫవాద్‌ చెప్పుకొచ్చాడు.. నిరుడు పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడులు జరిపారు.. ఇందులో 40 మందికి పైగా సైనికులు చనిపోయారు.. ఇది పాకిస్తాన్‌ పన్నాగమేనని భారత్‌ చెబుతూ వస్తోంది.. పాకిస్తాన్‌ మాత్రం తమ ప్రమేయం అస్సలు లేదని అంటూ వస్తోంది.. కాని నిన్న మాత్రం ఫవాద్‌ చౌధురి సాక్షాత్తూ ఆ దేశ పార్లమెంట్‌లోనే నిజం ఒప్పుకున్నారు. ‘భారత భూభాగంలోకి వెళ్లి మరీ ఆ దేశంలోని పుల్వామాపై దాడి చేశాం..ఇమ్రాన్‌ఖాన్‌ సారథ్యంలో పాక్‌ సాధించిన ఘన విజయం అది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ఐఎఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ విడుదలకు ముందు పాకిస్తాన్‌ అగ్ర నాయకత్వం కాళ్లు చేతులు వణికాయన్న విపక్ష నేత సాదిఖ్‌ వ్యాఖ్యలకు తిప్పికొడుతూ ఫవాద్‌ ఈ మాటలన్నారు. అయితే ఫవాద్‌ చేసిన వ్యాఖ్యలు పాక్‌ పార్లమెంట్‌లో దుమారం పుట్టించాయి. నోరు జారిన విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఫవాద్‌ నాలిక తిప్పారు.. అబ్బే తాను అన్నది పుల్వామా దాడి గురించి కాదని, పుల్వామా ఘటన తర్వాత భారత భూభాగంలోకి వెళ్లి మరీ దాడి చేశామని అన్నానంతేనని బుకాయించారు. పుల్వామా దాడి తర్వాత భారత్‌తో జరిగిన వైమానిక దాడి గురించే తాను ప్రస్తావించానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తాము కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తన మాటలను వక్రీకరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎంతైనా కల్లబొల్లి కబుర్లు చెప్పడంలో పాక్‌ తర్వాతే ఎవరైనా!!