అభినందన్పై మాట్లాడిన అయాజ్ సాదిఖ్పై దేశద్రోహం కేసు!
పాకిస్తాన్ ఎంపీ అయాజ్ సాదిఖ్పై దేశద్రోహం కేసు నమోదు చేయడానికి ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం రెడీ అవుతోంది. అంతగా దేశద్రోహం ఏం చేశాడయ్యా అంటే వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విడుదల సమయంలో
పాకిస్తాన్ ఎంపీ అయాజ్ సాదిఖ్పై దేశద్రోహం కేసు నమోదు చేయడానికి ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం రెడీ అవుతోంది. అంతగా దేశద్రోహం ఏం చేశాడయ్యా అంటే వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విడుదల సమయంలో పాకిస్తాన్ భయంతో గజగజ వణికిపోయిందని చెప్పడమే! నిజం చెప్పినా నిష్టూరమే అక్కడ! సాదిఖ్పై దేశవ్యాప్తంగా అనేక ఫిర్యాదులు వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు.. దేశ సార్వభౌమాధికారానికి సాదిఖ్ తూట్లు పొడిచారన్నది పోలీసులు మాట! ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలంటూ అనేక మంది డిమాండ్ చేస్తున్నారని, ప్రజల కోరిక మేరకే ఆయనపై దేశద్రోహం నమోదు చేయాలని అనుకుంటున్నామని అంతర్గత వ్యవహారాల మంత్రి ఏజా షా అంటున్నారు. సాదిఖ్ను దేశద్రోహిగా పేర్కొంటూ లాహోర్ నగరంలో పోస్టర్లు వెలిశాయి.. అయితే ఈ ఘటనపై అధికార, విపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. రాజకీయ కక్షతోనే ప్రతిపక్ష నాయకులపై ప్రభుత్వం దేశద్రోహం కేసులు నమోదు చేస్తున్నదని ప్రతిపక్ష పీఎంఎల్-ఎన్ పార్టీ అంటోంది..సాదిఖ్ చెప్పినదాంట్లో తప్పేముందని చెబుతోంది. ఇంతకీ సాదిఖ్ అన్నదేమిటంటే.. లాస్టియర్ పాకిస్తాన్తో జరిగిన వైమానిక పోరులో భారతీయ వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ శత్రువులను తరిమికొడుతూ పాక్ భూభాగంలోకి దిగారు కదా! ఆ తర్వాత పాకిస్తాన్ ఆయనను వదిలిపెట్టిన విషయాలు తెలిసినవే కదా! ఆ సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా గజగజమని వణికిపోయారంటూ సాదిఖ్ చెప్పారు. విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్ ఖరేషి కూడా భయపడ్డారన్నారు.. ఇదిలాఉంటే అభినందన్పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని సాదిఖ్ అంటున్నారు.. తాను ఏనాడూ బాధ్యతారహితంగా మాట్లాడింది లేదన్నారు. గతంలో జాతీయ భద్రత కమిటీకి అధిపతిగా వ్యవహరించిన తన దగ్గర అనేక రహస్యాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు అయాజ్ సాదిఖ్..