కరోనా అలర్ట్ః ఖమ్మంలో మరో రెండు కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయని అనుకునే క్రమంలోనే ఏదో ఒకచోట వైరస్ విజృంభిస్తోంది. తాజాగా ఖమ్మం జిల్లాలో మరో రెండు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. జిల్లా కలెక్టర్..
తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయని అనుకునే క్రమంలోనే ఏదో ఒకచోట వైరస్ విజృంభిస్తోంది. తాజాగా ఖమ్మం జిల్లాలో మరో రెండు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. శనివారం కలెక్టరేట్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో కరోనా పరిస్థితులను వివరించారు. జిల్లాలో మొత్తం ఇప్పటి వరకు నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు.
ఖమ్మం నగరంలోని పెద్దతండా, ఖిల్లాతో పాటు మోతీనగర్ను కూడా కంటైన్మెంట్ జోన్గా గుర్తించినట్లుగా కలెక్టర్ కర్ణన్ వెల్లడించారు. అయితే, కంటైన్మెంట్ జోన్లో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి నిత్యవసరాలు, కూరగాయలు ప్రతి ఇంటికీ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. తాజాగా గుర్తించిన కరోనా పాజిటివ్ కేసుతో 28 మందికి, రెండో కేసుతో మరో 35 మంది దగ్గరగా ఉన్నట్లుగా గుర్తించామని చెప్పారు. ఇప్పటి వరకు వీరిలో మొదటి, రెండో కేసు నుంచి ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదైనట్లు వివరించారు. ఇక లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటామని ఖమ్మం పోలీస్ కమిషనర్ ఇక్బాల్ హెచ్చరించారు.