యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్..
ఆన్లైన్లో పబ్జీ ఆడుతూ..చదువును నిర్లక్ష్యం చేస్తున్న కొడుకును తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన ఆ బాలుడు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. కాగా, అటువంటి సంఘటనే మరొకటి మంచిర్యాల జిల్లాలో జరిగింది.
ఆన్లైన్లో పబ్జీ ఆడుతూ..చదువును నిర్లక్ష్యం చేస్తున్న కొడుకును తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన ఆ బాలుడు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. కాగా, అటువంటి సంఘటనే మరొకటి తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో జరిగింది. ఆన్లైన్ గేమ్స్ వ్యసనంగా మారిన ఓ యువకుడు లక్షల్లో అప్పులు చేశాడు. తల్లిదండ్రులు మందలించటంతో చివరకు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. లక్షెట్టిపేట,మోదెల గ్రామానికి చెందిన తోట శంకర్-లక్ష్మిల కొడుకు మధూకర్ హైదరాబాద్లో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. అయితే, కరోనా లాక్డౌన్ కారణంగా ఇంటికి వచ్చిన మధూకర్…ఐదు నెలలుగా సెల్ఫోన్లో దఫాబెట్ గేమ్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో రూ.15 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. విషయం తండ్రికి తెలియడంతో అప్పు తెచ్చి కట్టేశాడు. ఇంకోసారి అలాంటి గేమ్లు ఆడవద్దని నచ్చజెప్పాడు. అంతపెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకోవడంతో మధూకర్ తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ నెల 7న పని మీద బయటకు వెళ్తున్నానని చెప్పి మంచిర్యాలకు వెళ్లి పురుగుల మందు కొనుక్కొని శివారు ప్రాంతంలో తాగాడు. అనంతరం బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వారు కుటుంబసభ్యులకు సమాచారమివ్వడంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
ఎంతచెప్పినా వినకుండా..ఆన్లైన్ జూదం పేరుతో..అప్పులు చేస్తూ…చివరకు ప్రాణాలు పొగొట్టుకున్న కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ న్లైన్ గేమ్ కు బానిసకావడం వల్లే తమ కొడుకు చనిపోయాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాకాసి లాగా మనుషుల ప్రాణాలు మింగుతున్న ఈ గేమ్ ను నిషేదించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.