టోక్యో ఒలింపిక్స్ రీషెడ్యూల్.. కొత్త తేదీలు ఇవే..!
కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది జూలైలో మొదలు కావాల్సిన టోక్యో ఒలింపిక్స్ను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది జూలైలో మొదలు కావాల్సిన టోక్యో ఒలింపిక్స్ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ క్రీడలకు సంబంధించి తాజాగా రీషెడ్యూల్ ఖరారైంది. వాటికి సంబంధించి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కొత్త తేదీలను ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులతో సుదీర్ఘంగా చర్చించిన ఐఓసీ కొత్త తేదీలపై ఓ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జూలై నెలలో ఒలింపిక్స్ను నిర్వహించనున్నట్లు ఐఓసీ స్పష్టం చేసింది. వచ్చే ఏడాది(2021) జూలై 23వ తేదీ నుంచి టోక్యో వేదికగా ఒలింపిక్స్ ప్రారంభం కానుందని.. ఆగస్టు 8వ తేదీన ముగియనుందని ఐఓసీ పేర్కొంది. మరోవైపు 2021 ఆగస్టు 24వ తేదీ నుంచి సెప్టెంబర్5 వరకూ పారా ఒలింపిక్స్ను నిర్వహించనున్నారు.
కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ను వాయిదా వేయాలని ఒలింపిక్ సభ్య దేశాలన్ని ఐఓసీని కోరాయి. దీంతో ఎట్టకేలకు ఈ మెగా క్రీడలు వాయిదా పడ్డాయి. వీటిని రీషెడ్యూల్ చేయడం వల్ల ఖర్చు భారీగా పెరగనుందని టోక్యో నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యాషిరో మోరి, సీఈవో తుషిరో ముటో అన్నారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. అంతేకాదు ఇప్పటివరకు అర్హత సాధించిన అథ్లెట్లు మళ్లీ క్వాలిఫయింగ్ టోర్నీలు ఆడాల్సిన అవసరం లేదని కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటికే క్వాలిఫై అయిన అథ్లెట్లకు కాస్త ఊరట లభించినట్లైంది.
Read This Story Also: శ్రీరామనవమి వేడుకలు.. దేవాదాయ శాఖ సంచలన నిర్ణయం..!