టీచర్కు విద్యార్థుల ‘గురుదక్షిణ’.. భావోద్వేగంలో ఉపాధ్యాయుడు
కరోనా, లాక్డౌన్ చాలా మంది జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తోంది. లాక్డౌన్ కారణంగా అసంఘటిత రంగాల్లో పనిచేసే వారి పరిస్థితి దారుణంగా ఉంటోంది. ముఖ్యంగా గత కొంత కాలంగా చిన్నపాటి ప్రైవేటు స్కూళ్లలో పని చేసే ఉపాధ్యాయుల పరిస్థితి మరింత దయనీయాంగా మారింది.
కరోనా, లాక్డౌన్ చాలా మంది జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తోంది. లాక్డౌన్ కారణంగా అసంఘటిత రంగాల్లో పనిచేసే వారి పరిస్థితి దారుణంగా ఉంటోంది. ముఖ్యంగా గత కొంత కాలంగా చిన్నపాటి ప్రైవేటు స్కూళ్లలో పని చేసే ఉపాధ్యాయుల పరిస్థితి మరింత దయనీయాంగా మారింది. నాలుగైదు నెలల నుంచి జీతాలు లేక చాలా మంది అవస్థలు పడుతున్నారు. ఉపాధి లేక, చేతిలో డబ్బులేక,ఇల్లు గడవని స్థితిలో కొందరు వ్యవసాయం చేస్తూ..మరికొందరు కూరగాయలు అమ్ముకుంటున్న సంఘటనలు చూస్తున్నాం..ఈ క్రమంలోనే ఓ ఉపాధ్యాయుడు పడుతున్న అవస్థలు చూడలేక పూర్వ విద్యార్థులు ఆయన రుణం తీర్చుకొనే ప్రయత్నం చేశారు. చేతిలో పనిలేక అవస్థలు పడుతున్న గురువుకు ఉపాధి కల్పించారు.
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన 52 ఏళ్ల ప్రైవేటు స్కూలు ఉపాధ్యాయుడు హనుమంతుల రఘుకు కరోనా, లాక్డౌన్ కారణంగా ఉపాధి లేకుండా పోయింది. టీచర్ వృత్తి కోల్పోవడంతో అతని కుటుంబానికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. అతని కుమారుడు కూడా నిరుద్యోగి కావడంతో ఇల్లు గడవడం మరింత కష్టమైపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన పూర్వ విద్యార్థులు రఘుకు సాయం చేయాలని భావించారు. 1997-98 బ్యాచ్కు చెందిన కొంతమంది విద్యార్థులంతా కలిసి వారి గురువుకు టిఫిన్ సెంటర్ పెట్టుకొనేందుకు ఓ షెడ్డును కట్టించారు.
విద్యార్థుల సాయానికి ఉప్పొంగిన ఉపాధ్యాయుడు ఆ టిఫిన్ సెంటర్కు ‘గురుదక్షిణ’ అని నామకరణం చేశాడు. తనను ఆదుకునేందుకు వచ్చిన తన పూర్వ విద్యార్థులకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియడం లేదంటూ రఘు భావోద్వేగానికి లోనయ్యారు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఈ టిఫిన్ సెంటర్కు కస్టమర్లను కూడా తామే తీసుకొస్తామని విద్యార్థులు చెబుతున్నారు.
Read More: