ఖాతాలోని నగదు కోసం మంచంతో సహా లాక్కెళ్లిన మహిళ..!
ప్రభుత్వం వేసిన ఫించన్ డబ్బులను తీసుకునేందుకు మంచానపడ్డ తల్లిని రోడ్డుపై బ్యాంకుకు ఈడ్చుకెళ్లింది ఓ మహిళ.
ఒడిశాలో హృదయ విదారకర సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం వేసిన ఫించన్ డబ్బులను తీసుకునేందుకు మంచానపడ్డ తల్లిని రోడ్డుపై బ్యాంకుకు ఈడ్చుకెళ్లింది ఓ మహిళ. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నౌపారా జిల్లాకు బార్గావున్కు చెందిన పుంజీమతి దేవి బ్యాంకు ఖాతాలో ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 జమ చేసింది. కూలీ పని చేసుకునే ఆ కుటుంబం నిత్యావసరాలు కొనుక్కునేందుకు డబ్బుల అవసరం ఏర్పడింది. దీంతో బ్యాంకులో జమ చేసిన నగదును తీసుకోవాలని భావించింది ఆమె కూతురు. సదరు మహిళ జూన్ 9న ఉత్కల్ గ్రామీణ బ్యాంకుకు వెళ్లి తన తల్లి ఖాతాలోని నగదు కావాలని బ్యాంక్ అధికారులను కోరింది. అయితే ఖాతాదారు ఉంటేనే డబ్బులు ఇస్తామని బ్యాంకు మేనేజర్ అజిత్ ప్రధాన్ తేల్చి చెప్పాడు. దీంతో ఆమె గత్యంతరం లేని పరిస్థితిలో మంచాన పడ్డ వందేళ్ల వయసున్న తల్లిని బ్యాంకు వరకూ మంచంతో సహా లాక్కుంటూ వెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మధుస్మిత సాహో స్పందించారు. మహిళ తొందరపాటు వల్లే ఇలా జరిగిందన్నారు. బ్యాంకు మొత్తాన్ని ఒకరే నిర్వహిస్తుండడంతో అదే రోజు ఆమె ఇంటికి వెళ్లి డబ్బులు ఇవ్వడం వీలుకాలేదన్నారు. మరుసటి రోజు మహిళ ఇంటికి వస్తానని చెప్పాడు. కానీ ఆమె వినిపించుకోకుండా తల్లిని మంచంలో వేసి తీసుకువచ్చి డబ్బులు తీసుకుందని కలెక్టర్ తెలిపింది.