ఏపీ : ఆ 4 జిల్లాల్లో లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రోజూ భారీగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వైరస్ ప్రభావం అధికంగా ఉంది.
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రోజూ భారీగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వైరస్ ప్రభావం అధికంగా ఉంది. ఈ వైరస్ జనాలపై విభిన్న రూపాల్లో ప్రభావం చూపుతోంది. ఎలాంటి సింటమ్స్ లేకపోయినా చాలామందికి పాజిటివ్గా నిర్ధారణ అవుతోంది. కరోనా లక్షణాలైన జ్వరం, జలుబు, దగ్గు లేకుండానే కోవిడ్ సోకినట్టు తేలుతోంది. దీనికి సంబంధించి సీరో సర్వైలెన్స్ సర్వేలో పలు ఇంట్రస్టింగ్ విషయాలు బయటపడ్డాయి.
కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో సీరో సర్వైలెన్స్ సర్వేను వైద్యఆరోగ్య శాఖ చేపట్టింది. ఈ నాలుగు జిల్లాల్లో నమోదైన కేసుల్లో సింటమ్స్ లేకుండానే ఎక్కువమందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అనంతపురం జిల్లాలో 99.5 శాతం, కృష్ణా జిల్లాలో 99.4 శాతం, నెల్లూరు జిల్లాలో 96.1 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 92.8 శాతం మందికి ఎటువంటి లక్షణాల్లేకుండానే వైరస్ సోకింది. ముఖ్యంగా కృష్ణా జిల్లా విషయానికి వస్తే… ఎక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో 22.3 శాతం మందికి కరోనా వచ్చివెళ్లినట్లు కూడా తెలియదు. ఆ 22.3 శాతం మందిలో యాంటీబాడీస్ డెవలప్ చెందినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో ఎలాంటి సింటమ్స్ లేకుండా కోవిడ్ సోకిన వారిని పది రోజుల పాటు హోం క్వారంటైన్, ఐసోలేషన్ సెంటర్లలో ఉంచుతున్నారు అధికారులు. పది రోజుల్లో వ్యాధి తీవ్రత పెరిగి.. జ్వరంగానీ, దగ్గుగానీ వస్తే వాటికి మెడిసిన్ ఇస్తారు. లేదంటే సరైన పోషకాహారం తీసుకుంటే సరిపోతుంది. 11వ రోజు నుంచి వారు జాగ్రత్తలు తీసుకుంటూ బయట తిరగొచ్చు. ఇక వారి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండదు. మళ్లీ టెస్టులు కూడా అవసరం లేదట. ఇలాంటి వారు ఎక్కువ మంది హోం క్వారంటైన్లో ఉంటారని కమాండ్ కంట్రోల్ సెంటర్ స్పెషల్ ఆఫిసర్ డాక్టర్ కె. ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
Also Read :
పాస్పోర్టు వెరిఫికేషన్ ప్రైవేటు సంస్థల చేతికి !
వైఎస్సార్ ఆసరా నగదుపై ఆంక్షలు లేవు, ఉత్తర్వుల్లో తేల్చి చెప్పిన ప్రభుత్వం