విద్యాసంస్థలకు 50కి.మీల పరిధిలో వాటి అమ్మకాలు ఉండకూడదు
దేశంలోని విద్యా సంస్థల పరిసరాల్లో అనారోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేకుండా చేయాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) తెలిపింది.
FSSAI on food in schools: దేశంలోని విద్యా సంస్థల పరిసరాల్లో అనారోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేకుండా చేయాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) తెలిపింది. విద్యా సంస్థలకు 50కి.మీల పరిధిలో జంక్ ఫుడ్ అమ్మకాలు, ప్రచారంపై నిషేధం అమల్లో ఉంటుందని ఆ సంస్థ వెల్లడించింది అలాగే హాస్టళ్లు, వంట గదులు, మెస్లు, క్యాంటీన్లలో కొవ్వు, ఉప్పు, చక్కెర అధికంగా ఉన్న వస్తువులను అమ్మకూడదని FSSAIలోని కమిటీ తాజాగా నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థులకు సురక్షితమైన ఆహారం ఇచ్చే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈవో అరుణ్ సింగాల్ తెలిపారు. అయితే విద్యాసంస్థల పరిసరాల్లో జంక్ ఫుడ్ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలంటూ 2015లో ఢిల్లీ హైకోర్టు ఎఫ్ఎస్ఎస్ఏఐని ఆదేశించిన విషయం తెలిసిందే.
కొత్త మార్గదర్శకాల ప్రకారం విద్యా సంస్థల్లోని క్యాంటీన్లు, మెస్లు, కిచెన్లు భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ నుంచి లైసెన్స్ తీసుకోవాలి. అలాగే మధ్యాహ్న భోజన పథకం కింద ఆహారం అందించే వారు కూడా తమ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకొని లైసెన్స్ పొందాల్సి ఉంటుందని వెల్లడించింది. అలాగే విద్యా సంస్థలు కూడా ఆహారంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచించింది. ఆరోగ్యమైన ఆహారం తినేలా, ఆహారాన్ని పడేయకుండా వారికి వివరించాలని తెలిపింది.
Read This Story Also: 30,887 మెడికల్ పోస్టుల భర్తీకి.. ఏపీ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్