నిరూపణ పక్కన పెట్టిండి.. అభియోగాలుంటే కానిస్టేబుల్ పోస్టుకు అనర్హులే..!
క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉండి తర్వాత తుది విచారణలో నిర్దోషులుగా నిరూపణ అయిన వాళ్లు కూడా పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు అనర్హులేనని హైకోర్టు స్పష్టం చేసింది. నేరారోపణలు ఎదుర్కొన్న వారిని కానిస్టేబుళ్లుగా ఎంపిక చేయడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. నేరం రుజువు కాకపోయినా, అభియోగాలను ఎదుర్కొన్నా అది ఒక మచ్చగానే భావించాలని పేర్కొంటూ జస్టిస్ పి.నవీన్రావు ఇటీవల తీర్పునిచ్చారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం, రాయకల్ గ్రామం చల్లిగడ్డ తండాకు చెందిన కర్రా కృష్ణకుమార్ అనే యువకుడు […]
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం, రాయకల్ గ్రామం చల్లిగడ్డ తండాకు చెందిన కర్రా కృష్ణకుమార్ అనే యువకుడు మెదక్ జిల్లా ఆర్మర్డ్ రిజర్వు కానిస్టేబుల్గా ఎన్నికయ్యాడు. అయితే తర్వాత ఒక క్రిమినల్ కేసులో పాత్ర ఉందని, నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో కేసు ఉందని తెలుసుకుని అధికారులు కృష్ణకుమార్కు నోటీసు జారీ చేశారు. అతని వివరణతో సంతృప్తి చెందని అధికారులు ఎంపిక జాబితా నుంచి అతని పేరును తొలగించారు. పోలీస్ నియామక మండలి అతని కానిస్టేబుల్ ఎంపికను రద్దు చేసింది.తన తండ్రి, సోదరుడు తనపై పెట్టిన తప్పుడు కేసును గత ఏడాది కింది కోర్టు కొట్టేసిందని, తనకు కానిస్టేబుల్ పోస్టు ఇవ్వాలని చేసుకున్న దరఖాస్తును మండలి పట్టించుకోలేదని కృష్ణకుమార్ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. కింది కోర్టు అతనిపై ఉన్న క్రిమినల్ కేసును విచారించిందని, పోలీస్ కానిస్టేబుల్ వంటి పోస్టులకు ఎంపిక అయ్యే వారిపై నేరాభియోగాలు కూడా ఉండకూడదని హెకోర్టు తీర్పులో పేర్కొంది.