Breaking news లాక్ డౌన్ ఎత్తేసే ఆలోచన లేదు: మోదీ
దేశంలో లాక్ డౌన్ను ఏప్రిల్ 14వ తేదీన ఎత్తేసే యోచన లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఒకేసారి లాక్ డౌన్ని ఎత్తివేసి కొత్త ప్రమాదాన్ని కొనితెచ్చుకోలేమని ఆయన అన్నారు.
Prime Minister comments on lock-down extension: దేశంలో లాక్ డౌన్ను ఏప్రిల్ 14వ తేదీన ఎత్తేసే యోచన లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఒకేసారి లాక్ డౌన్ని ఎత్తివేసి కొత్త ప్రమాదాన్ని కొనితెచ్చుకోలేమని ఆయన అన్నారు. బుధవారం పలు రాజకీయ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలతో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా భేటీ అయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే మోదీ బుధవారం అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ ఎత్తివేతపై పలువురు పలు రకాల సలహాలు, సూచనలు చేసినప్పటికీ.. మెజారిటీ పక్షాలు లాక్ డౌన్ కొనసాగింపునకే మొగ్గు చూపాయి.
ఈ సందర్భంగా పలు మార్లు తన అభిప్రాయాలను పార్లమెంటరీ పార్టీల నేతలతో పంచుకున్న మోదీ.. ఏప్రిల్ 14వ తేదీన లాక్ డౌన్ ఎత్తివేసే ఆలోచన లేదని హింట్ ఇచ్చారు. ఒకే సారి లాక్ డౌన్ ఎత్తివేయలేమని, లాక్ డౌన్ ఎత్తివేతపై వస్తున్న సలహాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రులందరితో సంప్రదించాల్సి ఉంటుందని తెలిపిన.. ఏప్రిల్ 14వ తేదీలోగా మరోసారి ముఖ్యమంత్రులతో భేటీ అయ్యే అవకాశాలున్నట్లు సంకేతాలిచ్చారు.
కరోనా తర్వాత పరిస్థితులు మునుపటిలాగా సాధారణంగా ఉండవని, కరోనాకు ముందు, కరోనాకు తరువాత అనే రకంగా పరిస్థితి ఉంటుందని మోదీ వ్యాఖ్యానించారు. ఈక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీలు పరస్పరం భిన్నమైన అభిప్రాయాన్ని ప్రధాని ముందుంచాయి. లాక్ డౌన్ను కనీసం మరో రెండు వారాల పాటు.. అంటే ఏప్రిల్ నెలాఖరుదాకా కొనసాగించానలి తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ వ్యక్తం చేసింది. అయితే.. కరోనా కేసులు లేని చోట్ల లాక్ డౌన్ను ఎత్తివేసి.. హాట్ స్పాట్లలో మరింత పకడ్బండీగా లాక్ డౌన్ కొనసాగించాలని ఏపీలో అధికార పార్టీ వైసీపీ ప్రధాన మంత్రిని కోరింది.