బ్రేకింగ్: కోవిడ్ ఎఫెక్ట్, ఈ సారి గణతంత్ర దినోత్సవాలకు విదేశీ నేతలెవరూ చీఫ్ గెస్టులుగా రాబోరు, కేంద్రం ప్రకటన
ఈ నెల 26 న జరిగే గణతంత్ర దినోత్సవాలకు విదేశీ నేతలెవరూ ముఖ్య అతిథులుగా రాబోరని కేంద్రం ప్రకటించింది. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ 19..,
ఈ నెల 26 న జరిగే గణతంత్ర దినోత్సవాలకు విదేశీ నేతలెవరూ ముఖ్య అతిథులుగా రాబోరని కేంద్రం ప్రకటించింది. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ 19 ఇంకా ప్రబలంగా ఉండడమే కారణమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ వెల్లడించారు. కోవిడ్ పాండమిక్ పూర్తిగా తగ్గలేదని, అందువల్ల ఈ ఏడాది రిపబ్లిక్ దినోత్సవ కార్యక్రమాలకు విదేశీ అధినేతలెవరినీ ఆహ్వానించరాదని నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. లోగడ ఈ కార్యక్రమానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ని చీఫ్ గెస్టుగా ఆహ్వానించారు. ఆయన కూడా ఇందుకు అంగీకరించారు. అయితే తమ దేశంలో మ్యుటెంట్ కరోనా వైరస్ ముప్పు తలెత్తిన దృష్ట్యా ఆయన తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు.
అటు-ఈ నెల 26 న రిపబ్లిక్ డే నాడు భారీ ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని రైతులు ఇదివరకే ప్రకటించారు. దీనివల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని, ఇది దేశానికి ఇరకాట పరిస్థితిని సృష్టిస్తుందని కేంద్రం ఆందోళన చెందుతోంది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో ఓ దరఖాస్తు కూడా దాఖలు చేసింది. బహుశా ఇది కూడా కేంద్ర తాజా నిర్ణయానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు.