వలస కార్మికుల మరణాలపై డేటా లేదు, పార్లమెంట్ లో కేంద్రం
వలస కార్మికుల మరణంపై డేటా ఏదీ లేదని, అందువల్ల వారి కుటుంబాలకు పరిహారం చెల్లించే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో తమ స్వరాష్ట్రాలకు వెళ్తూ చాలామంది వలస కూలీలు మధ్యలో..
వలస కార్మికుల మరణంపై డేటా ఏదీ లేదని, అందువల్ల వారి కుటుంబాలకు పరిహారం చెల్లించే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో తమ స్వరాష్ట్రాలకు వెళ్తూ చాలామంది వలస కూలీలు మధ్యలో ఆరోగ్య సంబంధ కారణాల వల్లో, ప్రమాదాలకు గురయ్యో మరణించారని, అలాంటి మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లిస్తారా అన్న విపక్షాల ప్రశ్నకు కేంద్రం ‘నో’ అని లోక్ సభలో చెప్పింది. దీంతో విపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి కోటిమందికి పైగా వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లారని కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్ తెలిపారు.
కాగా ఎంతమంది వలస కూలీలు మరణించారు, ఎంతమంది ఉపాధి కోల్పోయారు వంటి సమాచారమేదీ ప్రభుత్వం వద్ద లేకపోవడం దారుణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కనీసం మృతుల లెక్క కూడా లేకపోవడమేమిటన్నారు.మరోవైపు కేంద్ర నిర్లక్ష్యాన్ని కేరళ మంత్రి థామస్ ఐజాక్ కూడా తప్పు పడుతూ ట్వీట్ చేశారు.