ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ సంవత్సరం.. నో క్రెడిట్స్.. నో డిటెన్షన్..
కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో.. ఇంజనీరింగ్ విద్యార్థులకు జేఎన్టీయూ గొప్ప ఊరట ఇవ్వనున్నట్లు సమాచారం.
కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో.. ఇంజనీరింగ్ విద్యార్థులకు జేఎన్టీయూ గొప్ప ఊరట ఇవ్వనున్నట్లు సమాచారం. మునుపెన్నడూ లేని విధంగా ప్రత్యేక పరిస్థితులు నెలకొనడంతో ఆ ప్రభావం విద్యార్థులపై ఉండకుండా చర్యలకు ఉపక్రమించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి పరీక్షల నిర్వహణ, విద్యార్థుల ఉత్తీర్ణతపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఒక్క సెమిస్టర్కు డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేయాలని జేఎన్టీయూ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. అంటే పరీక్షలు రాసిన విద్యార్థులను క్రెడిట్స్తో సంబంధం లేకుండా పైతరగతులకు ప్రమోట్ చేస్తారు.
కాగా.. ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై నిర్వహించిన యూనివర్సిటీ రిజిస్ట్రార్ల వీడియో కాన్ఫరెన్స్లో జేఎన్టీయూ అధికారులు ఈ ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. దీన్ని అమలు చేస్తే జేఎన్టీయూ పరిధిలోని 151 కాలేజీల్లో ఉన్న సుమారు 2లక్షల మంది ఇంజనీరింగ్ ఫస్టియర్, సెకండియర్, థర్ట్ ఇయర్ విద్యార్థులకు ఊరట లభించనుంది. లాక్డౌన్ కారణంగా విద్యార్థులకు సిలబస్ పూర్తి కాలేదు. విద్యార్థులు కూడా చదువుపై శ్రద్ధపెట్టే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇదే బాటలో ఉస్మానియా యూనివర్సిటీ కూడా నడిచే అవకాశం ఉంది.
కాగా.. రాష్ట్రంలోని లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో జేఎన్టీయూ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆన్లైన్ తరగతులను అందిస్తున్నారు. వీడియో లెక్చర్స్, స్కైపీ, జూమ్, జిట్సీమీట్, మూక్స్, స్వయం, ఎన్పీటెల్ వంటి ఫ్లాట్ఫామ్స్ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. నూతన విద్యా సంవత్సరానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకకుంటున్నారు. ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన పరీక్షలను జూన్ నెలలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆ తర్వాత జులై రెండో వారంలో నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.