శశికళను అన్నా డీఎంకెలో చేర్చుకునే ప్రసక్తే లేదు ఆమెను ఆహ్వానించే ప్రతిపాదనే లేదు, తమిళనాడు సీఎం పళనిస్వామి
తమిళనాడు దివంగత నేత జయలలిత సన్నిహితురాలు శశికళను అన్నా డీఎంకే పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు..
తమిళనాడు దివంగత నేత జయలలిత సన్నిహితురాలు శశికళను అన్నా డీఎంకే పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు. ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని, కానీ అలాంటి ప్రతిపాదనే లేదని అయన చెప్పారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ నాలుగేళ్ల క్రితం జైలుకు వెళ్లారు. అయితే రూ. 10 కోట్ల జరిమానా చెల్లించడంతో వచ్ఛేవారం జైలు నుంచి విడుదల కానున్నారు. ఆమె విడుదలయ్యే ఈ నెల 27 న తాము జయలలిత మెమోరియల్ ను లాంచ్ చేస్తామని పళనిస్వామి తెలిపారు. ఇప్పటికే శశికళ మద్దతుదారులు ఆమె విడుదల కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఆమె విడుదలైతే తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతాయని భావిస్తున్నారు. డీఎంకే మాత్రం ఈ అంశంపై పెదవి విప్పడంలేదు.
లోగడ ఏ ఐ ఏ డీఎంకే నుంచి శశికళను పళనిస్వామి బహిష్కరించారు. అయితే ఆ తరువాత ఆమె వర్గం అన్నా డీఎంకేలో విలీనం కావచ్ఛునని వార్తలు వచ్చాయి. ఈ ఏడాది మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శశికళ తనకు ప్రధాన బలీయ ప్రత్యర్థిగా మారవచ్ఛునని పళనిస్వామి భావిస్తున్నారు.