నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక తేదీ ఖరారు
కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడ్డ నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 9న పోలింగ్ నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమీషన్.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. లాక్డౌన్ కారణంగా ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఖాళీగా ఉన్న స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అక్టోబర్ 9న పోలింగ్ నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం . ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 12న ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈసీ నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 7న పోలింగ్ జరగాల్సి ఉండగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్ వేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయణ్ని అనర్హుడిగా ప్రకటిస్తూ ఆప్పటి శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తి చేస్తూ కేంద్ర ఎన్నికల కమీషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీని టీఆర్ఎస్ సునాయాసంగా గెలుచుకునే అవకాశాలున్నాయి. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎన్నికల లాంఛనమే కానుంది.