నిజాం వారసుల వాదనలపై లండన్ కోర్టులో మళ్ళీ విచారణ
హైదరాబాద్ ఏడవ నిజాం వారసులు మళ్ళీ లండన్ హైకోర్టుకెక్కారు. బ్రిటన్ లోని బ్యాంకులో 35 మిలియన్ పౌండ్ల కేసుకు సంబంధించి గతంలో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను వారు సవాల్ చేశారు. ఈ సంపదపై ఇండియాకు..
హైదరాబాద్ ఏడవ నిజాం వారసులు మళ్ళీ లండన్ హైకోర్టుకెక్కారు. బ్రిటన్ లోని బ్యాంకులో 35 మిలియన్ పౌండ్ల కేసుకు సంబంధించి గతంలో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను వారు సవాల్ చేశారు. ఈ సంపదపై ఇండియాకు అనుకూలంగా లండన్ కోర్టు జస్టిస్ స్మిత్ గత ఏడాది ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. హైదరాబాద్ 8 వ నిజాంకు, ఆయన సోదరుడికి ఈ సంపద చెందుతుందని ఆయన వాటిలో పేర్కొన్నారు. పాకిస్తాన్ తో దశాబ్దాల తరబడి కొనసాగుతున్న లీగల్ వివాదం నేపథ్యంలో వారు రహస్యంగా ఒప్పందం కుదుర్చుకున్నారని వార్తలు వచ్చాయి. 1947 లో దేశ విభజన సమయంలో హైదరాబాద్ ఏడవ నిజాంకు చెందిన ఈ నిధులు తమకే చెందుతాయని వారు అన్నారు. అయితే ఏడవ నిజాం 116 మంది వారసుల తరఫున నజఫ్ అలీఖాన్.. నాటి జస్టిస్ స్మిత్ ఉత్తర్వులను తాజాగా సవాల్ చేశారు.
ఏడో నిజాం హయాం నాటి అడ్మినిస్ట్రేటర్ విశ్వాసోల్లంఘనకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఆ నిధులు ఇండియాకు రిలీజ్ కావాలనడంలో ఔచిత్యం లేదని, ఇద్దరు యువరాజులు.. ముకర్రం ఝా, ఆయన సోదరుడు ముఫకం ఝా తాము ఆర్థికపరంగా కష్టాలు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారని నజఫ్ అలీఖాన్ తెలిపారు. కాగా ఈ కేసును తిరగదోడేందుకు న్యాయ మూర్తి స్మిత్ నిరాకరించారు. 2019 లో తాను ఇచ్చిన తీర్పును సవాలు చేయడానికి ఈయనకు అర్హత లేదని స్పష్టం చేశారు. అయితే ఏడో నిజాం ఎస్టేట్ లోని అడ్మినిస్ట్రేటర్ పై వచ్చిన ఆరోపణలపై వాదనలను ఆలకించేందుకు ఆయన అంగీకరించారు. కోర్టులో రెండు రోజులపాటు ఈ వాదనలు కొనసాగనున్నాయి.