కరోనా సంక్షోభంలో కేంద్రం ఊరట.. త్వరలో ఆర్థిక ప్యాకేజీ
కరోనా వైరస్ సృష్టిస్తున్న సంక్షోభం అంతా ఇంతా కాదు. ఆర్థిక, పారిశ్రామికరంగాలన్నీ కుదేలవుతున్నాయి. వైరస్ ప్రభావంతో సమస్యలను ఎదుర్కొంటున్న రంగాలకు కేంద్రప్రభుత్వం భరోసానందిస్తోంది. సంక్షోభంలో పడ్డ ఆయా రంగాలకు ఆర్థిక...
కోవిడ్-19: ఇప్పుడు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. కరోనా బారినపడ్డఅన్ని దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. దీని ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. కరోనా వైరస్ సృష్టిస్తున్న సంక్షోభం అంతా ఇంతా కాదు. ఆర్థిక, పారిశ్రామికరంగాలన్నీ కుదేలవుతున్నాయి. వైరస్ ప్రభావంతో సమస్యలను ఎదుర్కొంటున్న రంగాలకు కేంద్రప్రభుత్వం భరోసానందిస్తోంది. సంక్షోభంలో పడ్డ ఆయా రంగాలకు ఆర్థిక ప్యాకేజీని వీలైనంత త్వరలో ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం మీడియా ప్రకటనలో వెల్లడించారు.
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హై అలర్ట్ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే వైరస్ కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టాయి. మరో వైపు రేపు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ నేపథ్యంలోనే పన్నులను, వడ్డీరేట్లను తగ్గించడంతోపాటు రూ.2 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలను ప్రకటించాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కరోనా వైరస్ వల్ల తలెత్తిన మందగమనం, సరఫరాల వ్యవస్థలో తలెత్తిన సమస్యలతో వ్యాపారాలకు భారీ విఘాతం కలిగిందని, రియల్ ఎస్టేట్, పౌరవిమానయానం, పర్యాటకం, ఆతిథ్యం లాంటి రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు.
ఈ విపత్కర పరిస్థితి నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు జీడీపీలో 1 శాతం (రూ.2 లక్షల కోట్ల) మొత్తాన్ని ఆధార్ ఆధారిత ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకం ద్వారా ఆర్థిక ఉద్దీపనల రూపంలో అందజేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని శుక్రవారం ప్రధాని మోదీకి రాసిన లేఖలో సీఐఐ విజ్ఞప్తి చేసింది. దేశంలోని ప్రతి పౌరునికి రూ.5 వేలు, ప్రత్యేకించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు రూ.10 వేల చొప్పున ఈ ఉద్దీపనలను అందజేయాలని సూచించింది. ‘దీర్ఘకాలిక మూలధన లాభాలపై వసూలు చేస్తున్న 10 శాతం పన్నును తొలిగించడంతోపాటు మొత్తం డివిడెండ్ పన్నును 25 శాతంగా ఖరారుచేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ప్రధానికి రాసిన లేఖలో సీఐఐ కోరింది.
కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లను తీసుకొచ్చిందని, ఈ సవాళ్లు అటు డిమాండ్కు, ఇటు సరఫరాకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని, ఈ సమస్యలతో దేశ ఆర్థిక వ్యవస్థ గాడితప్పే అవకాశమున్నదని భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా 50 శాతంపైగా కంపెనీల కార్యకలాపాలపై ప్రభావం చూపుతోందని ఫిక్కీ తెలిపింది. ఫిక్కీ నిర్వహించిన సర్వేలో 80 శాతం కంపెనీలు నగదు రాక తగ్గినట్టు తెలిపాయి. కరోనాతో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, డిమాండ్. సరఫరా దెబ్బతిందని ఫిక్కీ వివరించింది. దీంతో ఉద్యోగులకు వేతనాల చెల్లింపులతోపాటు రుణాలు, వడ్డీ, పన్నుల చెల్లింపులపై ప్రభావం పడుతున్నదని ఫిక్కీ వివరించింది.