ఎన్ఐఏలో కరోనా కలకలం..ఏఎస్ఐకి పాజిటివ్
కోవిడ్-19 భూతం ఇప్పటివరకు పోలీస్ స్టేషన్లకు పాకిన వైరస్..ఇపుడు ఎన్ఐఏను తాకింది. జాతీయ దర్యాప్తు సంస్థ..
కరోనా ఉధృతికి మహారాష్ట్ర చిగురుటాకుల వణికిపోతోంది. దేశంలోనే అత్యధిక కేసులతో ఆ రాష్ట్రం టాప్లో ఉంది. మురికివాడల నుంచి వీఐపీలు, సెలబ్రిటీల నివాసాల వరకు కోవిడ్ వైరస్ వేగంగా విస్తరిస్తూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యంగా ఆర్థిక రాజధాని ముంబయ్ నగరాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా ఇప్పుడు ఎన్ ఐఏకు చెమటలు పట్టిస్తోంది.
కోవిడ్-19 భూతం ఇప్పటివరకు పోలీస్ స్టేషన్లకు పాకిన వైరస్..ఇపుడు ఎన్ఐఏను తాకింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ కు పరీక్షలు నిర్వహించగా..కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ముంబై ఎన్ఐఏ ఆఫీసులో సదరు వ్యక్తి ఏఎస్ ఐగా గా విధులు నిర్వర్తిస్తున్నాడు. దీంతో అప్రమత్తమైన ఎన్ఐఏ బృందం కార్యాలయంలో పనిచేస్తున్న వారు ఎవరైనా..కరోనా పాజిటివ్ గా వచ్చిన ఏఎస్ఐతో సన్నిహితంగా మెలిగారా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఆఫీసర్లందరికీ పరీక్షలు నిర్వహించి..అనుమానిత లక్షణాలున్న వారిని క్వారంటైన్ లో ఉంచనున్నట్లు ఎన్ఐఏ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఆసియాలోని అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లుగా తెలుస్తోంది. ఇరుకైన వీధులు, అపరిశుభ్ర వాతావరణంతోపాటు ఒకే గదిలో పది నుంచి ఇరవై మంది వరకూ నివసించే ధారావిలో కరోనా వైరస్ వ్యాప్తి కలకలం రేపింది. పెద్దఎత్తున పాజిటివ్ కేసులు బయటపడటం స్థానికులను, అధికారయంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేసింది. అయితే గత రెండు మూడు రోజుల నుంచి కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. శుక్రవారం అతి తక్కువగా కేవలం ఐదు కేసులు మాత్రమే నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.