విషాదం:పెళ్లయిన నాలుగు రోజులకే వరుడు ఆత్మహత్య
ఆ నవ దంపతులకు నాలుగు రోజుల క్రితమే పెళ్లయింది. కోటి ఆశలతో కొత్త పెళ్లికూతురు అత్తవారింట్లో అడుగు పెట్టింది. కానీ, ఆమె ఆశలన్నీ అడియాశలయ్యాయి....
ఆ నవ దంపతులకు నాలుగు రోజుల క్రితమే పెళ్లయింది. కోటి ఆశలతో కొత్త పెళ్లికూతురు అత్తవారింట్లో అడుగు పెట్టింది. కానీ, ఆమె ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ, వరుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆ రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లాలో సోమవారం రోజున చోటు చేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు…
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పుట్టచెరువుపాలేనికి చెందిన యువకుడికి, జరుగుమల్లి మండలం పమిడిపాడుకు చెందిన యువతితో ఈ నెల 24న వివాహమైంది. వరుడ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కానీ, సరైనా ఉద్యోగం రాకపోవడంతో గ్రామంలోనే పొలం పనులు చేసుకుంటూ చిట్టీలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం రోజున అతడు సూరాయపాలెంలోని సుబాబుల్ తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక పశువుల కాపరులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతుడిని గుర్తించి కుటుంబసభ్యులకు తెలియజేశారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లయిన నాలుగు రోజులకే వరుడు ఆత్మహత్య చేసుకోవడంతో వధువుతో పాటుగా రెండు కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపించాయి. దీంతో పుట్టచెరువుపాలెంలో విషాద చాయలు అలుముకున్నాయి.