కాకినాడ కరోనా పరీక్షల్లో నిర్లక్ష్యం.. ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధితులు
కాకినాడ కరోనా పరీక్షల్లో నిర్లక్ష్యం చోటుచేసుకుంది. కరోనా వైద్య పరీక్షల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు నెగిటివ్ అంటూ సమాచారం ఇస్తున్నారు.
కాకినాడ కరోనా పరీక్షల్లో నిర్లక్ష్యం చోటుచేసుకుంది. కరోనా వైద్య పరీక్షల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు నెగిటివ్ అంటూ సమాచారం ఇస్తున్నారు. కరోనా ల్యాబ్ నుంచి వచ్చిన పాజిటివ్ రిపోర్ట్లను వెబ్సైట్లో నెగిటివ్గా అప్లోడ్ చేస్తున్నారు. దీంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం కాకినాడ నగరంలోని జగన్నాయక్పూర్లో ఓ యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు సమాచారం అందించారు. అయితే వైద్య సిబ్బంది మాత్రం నెగిటివ్ ఉందని వెల్లడించింది. ఆ తరువాత పాజిటివ్ ఉందని, క్వారంటైన్కు వెళ్లాలంటూ ఆ యువకుడికి సూచించింది. ఆన్లైన్లోనూ ఆ యువకుడికి కరోనా నెగిటివ్గా చూపించింది. ఇదేంటని ప్రశ్నిస్తే వైద్య సిబ్బంది పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. కరోనా పాజిటివ్కి బదులు నెగెటివ్ రిపోర్ట్ను డేటా ఎంట్రీ ఆపరేటర్ అప్ లోడ్ చేశారని జిల్లా కోవిడ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది చెబుతుందని ఆ బాధితుడు తెలిపాడు. దీంతో తనకు కరోనా సోకిందో లేదో తెలియడం లేదని ఆ యువకుడు వాపోయాడు. ఇదిలా ఉంటే ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తెలిసిన అతడి స్నేహితుడు(ప్రైమరీ కాంటాక్ట్) మానసిక ఒత్తిడికి గురై ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. కోవిడ్ కంట్రోల్ సెంటర్, క్షేత్ర స్థాయి సిబ్బంది మధ్య సమన్వయ లోపంతోనే ఈ ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఓ రిపోర్ట్ కోసం రెండు రోజులుగా జిల్లా యంత్రాంగం తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం.