#AmmoruThalli: ‘అమ్మోరు తల్లి’… దొంగ బాబా బెదుర్స్.. కామెడీ అదుర్స్.. మంచి ప్రయత్నం..

ఆర్. జె. బాలాజీ, శరవణన్ డైరక్టర్లుగా కలిసి తీసిన తొలి సినిమా 'అమ్మోరు తల్లి'. దేవుడు భూముల అన్యాక్రాంతం, దొంగ బాబాలు.. ఈ రెండు అంశాల నేపధ్యంలో సాగే సినిమా ఇది.

#AmmoruThalli: 'అమ్మోరు తల్లి'... దొంగ బాబా బెదుర్స్.. కామెడీ అదుర్స్.. మంచి ప్రయత్నం..
Follow us

|

Updated on: Nov 15, 2020 | 12:31 PM

Ammoru Thalli Movie

చిత్రం: అమ్మోరు తల్లి

కథ, స్క్రీన్ ప్లే: ఆర్. జె. బాలాజీ & టీం

డైరెక్టర్: ఆర్. జె. బాలాజీ, ఎన్. జె. శరవణన్

తారాగణం: నయనతార, ఆర్. జె. బాలాజీ, ఊర్వశి, స్మృతి వెంకట్, మధు, అభినయ, అజయ్ ఘోష్ తదితరులు

రిలీజ్ డేట్: 14-11-2020(డిస్నీ హాట్‌స్టార్)

ఆర్. జె. బాలాజీ, శరవణన్ డైరక్టర్లుగా కలిసి తీసిన తొలి సినిమా ‘అమ్మోరు తల్లి’. దేవుడు భూముల అన్యాక్రాంతం, దొంగ బాబాలు.. ఈ రెండు అంశాల నేపధ్యంలో సాగే సినిమా ఇది. ఈ సినిమా తమిళంలో ‘మూకుత్తి అమ్మన్’ పేరుతో తెరకెక్కింది. ఈ మూవీలోని ప్రధాన పాత్రకు సూపర్ స్టార్ నయనతారను ఎంచుకోవడంతో హైప్ మరింతగా పెరిగింది. దీపావళి కానుకగా శనివారం నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీం అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో.? ఈ సమీక్షలో తెలుసుకుందాం.!

కథ:

ఏంగిల్స్ రామస్వామి( ఆర్. జె. బాలాజీ) కాశీబుగ్గ పట్టణంలోని ఉత్తరాంధ్ర టీవీకి రిపోర్టర్‌గా పని చేస్తుంటాడు. సుమారు ఆరేళ్లుగా ఓ దొంగ బాబా స్థానికంగా ఉండే 11 వేల ఎకరాలను భూ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడనే స్టోరీని కవర్ చేస్తుంటాడు. ఈ స్టోరీ క్లిక్ అయితే తనకు మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తాడు. ఇక అతడి చిన్నప్పుడే వాళ్ల తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో.. తల్లి, ముగ్గురు చెల్లెళ్ళను అన్ని తానై చూసుకుంటూ ఉంటాడు.

మరోవైపు రామస్వామి తల్లి బంగారం(ఊర్వశి) ఎప్పటినుంచో తిరుపతి వెళ్లాలని అనుకుంటుంది. అయితే ఏదో ఒక ఆటంకం రావడం వల్ల అది వీలవదు. దీనితో చుట్టుప్రక్కల వాళ్లు ఇచ్చిన సలహా మేరకు.. బంగారం కుటుంబంతో సహా వాళ్ల ఇంటి కుల దైవం ముక్కుపుడక అమ్మవారిని దర్శించుకుంటుంది. అక్కడ రామస్వామికి అమ్మవారు దర్శనమిస్తుంది. తన గుడిని తిరుపతిలా ఫేమస్ చేయాలని కోరుతుంది. అసలు అమ్మవారు ఎందుకు అలా అడిగింది.? దీనికి రామస్వామి ఒప్పుకున్నాడా.? వీరిద్దరి కథలో భగవతి బాబా( అజయ్ ఘోష్) పాత్ర ఏంటన్నది మిగతా కథ.

విశ్లేషణ:

భక్తి పేరుతో దేవుడి మాన్యాలను దోచేసే దొంగ బాబా ఆటను అమ్మవారు స్వయంగా భూమికి దిగి వచ్చి ఎలా ఆట కట్టించారన్నది.! ఈ సినిమా కీలకాంశం. మూసధోరణిలో కాకుండా కొంచెం కొత్తగా సినిమాను తీశారు. దానికి వినోదాన్ని కూడా జోడించడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఇక అమ్మవారి పాత్రలో నయనతార సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి. ఎక్కడా కూడా ఇబ్బందికరంగా లేకుండా ఆమె పాత్రను దర్శకులు చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దారు. అయితే సినిమాలోని కొన్ని డైలాగ్స్ మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టేలా ఉంటాయి.

ఎవరెలా చేశారంటే:

మధ్య తరగతి కుర్రాడు రామస్వామిగా ఆర్. జె. బాలాజీ అద్భుతంగా నటించాడు. అమ్మవారిగా నయనతార నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అటు దైవత్వాన్ని ప్రదర్శిస్తూ.. ఇటు వినోదాత్మక సన్నివేశాల్లో ప్రేక్షకులను నవ్వించింది. దొంగ బాబాగా అజయ్ ఘోష్ అదరగొట్టాడు. అతడి మేనరిజమ్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక బాలాజీ తల్లి పాత్రలో ఊర్వశి నటన బాగుంది. ఒకవైపు నలుగురి పిల్లలకు తల్లిగా.. మరోవైపు తన భర్త కోసం చాలా రోజుల నుంచి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న భార్యగా చక్కటి హావభావాలు పలికించింది. కొన్ని సీన్స్‌లో అయితే కన్నీళ్లు తెప్పిస్తుంది. సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ మరో ప్లస్ పాయింట్. ఎడిటింగ్, ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ఆర్. జె. బాలాజీ అండ్ టీం కథ, కథనాన్ని పకడ్బందీగా సిద్దం చేశారు. డైలాగులు ఆకట్టుకుంటాయి. ఆర్. జె. బాలాజీ, ఎన్. జె. శరవణన్‌లకు ఇదే తొలి సినిమా అయినా కూడా మెప్పించారు.

ప్లస్ పాయింట్స్:

నయనతార, బాలాజీ

స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్:

పాత కథ

చివరిగా: ‘అమ్మోరు తల్లి’… దొంగ బాబా బెదుర్స్.. కామెడీ అదుర్స్..