నక్సల్స్ దుశ్చర్య.. 11 వాహనాలకు నిప్పు..
జార్ఖండ్లో నక్సల్స్ దుశ్చర్యకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని లోహర్దగా జిల్లాలో పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఎక్స్కవేటర్లుతో సహా.. పలు లారీలు కూడా వీటిలో కాలిపోయాయి.
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓ వైపు దేశ ప్రజలంతా కరోనాపై పోరు కొనసాగిస్తుంటే.. మరోవైపు పోలీసులు, నక్సలైట్ల మధ్య నిత్యం ఎన్కౌంటర్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా.. జార్ఖండ్లో నక్సల్స్ దుశ్చర్యకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని లోహర్దగా జిల్లాలో పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఎక్స్కవేటర్లుతో సహా.. పలు లారీలు కూడా వీటిలో కాలిపోయాయి. కిస్కో పోలీస్ స్టేషన్ సమీపంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని స్థానిక ఐజీ సాకేత్ కుమార్ సింగ్ తెలిపారు. అయితే సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అక్కడి సమీపంలోనే నక్సలైట్లు పారిపోయారని.. ఆ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు.