అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ
తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నాలుగోరోజు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ ఇవాళ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు. చేతిలో రసపాత్రను ధరించి పరమేశ్వరునికి భిక్ష పెడుతున్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తోంది. ఇవాళ సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లో పోటెత్తారు. ఉచిత దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల వసతులు కల్పిస్తున్నారు అధికారులు. […]
తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నాలుగోరోజు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ ఇవాళ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు. చేతిలో రసపాత్రను ధరించి పరమేశ్వరునికి భిక్ష పెడుతున్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తోంది. ఇవాళ సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లో పోటెత్తారు. ఉచిత దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల వసతులు కల్పిస్తున్నారు అధికారులు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. మరోవైపు శ్రీశైలంలోనూ దసరా ఉత్సవాలు ఘనంగా జరగుతున్నాయి. ఇక తెలంగాణలోని వరంగల్ శ్రీభద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. అటు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవాలయం, బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో కూడా శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
అన్నపూర్ణాదేవి..
“ఉర్వీ సర్వ జయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ నారీ నీలసమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ సాక్షాన్ మోక్షకరీ సదా శుభకరీ కాశీ పురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ“.. అంటూ అమ్మ వారిని ఈ రోజు అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం.. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బిడ్డల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా రావడం ఈ అవతార విశేషం. పరిపూర్ణమైన చిత్తంతో ఆరాధించిన వారి సమస్తపోషణా భారాన్ని ఈమె స్వయంగా వహిస్తుంది. “ఓం శ్రీం హ్రీం క్లీం నమో భగవత్యన్నపూర్ణేశి మమాభిలషిత మహిదేవ్యన్నం స్వాహా” అనే మంత్రాన్ని జపించి అమ్మకు నివేదన చేయాలి. తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని పుష్పాలతో పూజించాలి. అన్నపూర్ణ స్తోత్రాలు చదవాలి. భోజనశాలలో అమ్మవారి చిత్రపటం ఉంచి, హారతులు ఇవ్వాలి.