
తమిళనాడులోని ఆండిపట్టి పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లోని ఫ్రిజ్ నుండి నీళ్ల బాటిల్ తీస్తుండగా ఓ యువకుడు కరెంట్ షాక్తో ప్రాణాలు కోల్పోయాడు. వివాహమై నాలుగు నెలలు కూడా గడవక ముందే ఈ విషాదం చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆండిపట్టి కామరాజ్ నగర్ 4వ వీధిలో నివసిస్తున్న తిరుమురుగన్ (24) అనే యువకుడికి, కనకలక్ష్మి (29) అనే మహిళతో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. కనకలక్ష్మికి గతంలోనే పెళ్లై 13 ఏళ్ల కుమార్తె ఉంది. మొదటి భర్తతో వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా ఆమె విడిపోయి జీవిస్తోంది. ఈ క్రమంలోనే తిరుమురుగన్, కనకలక్ష్మిలు వివాహం చేసుకుని, కూతురు కావ్యతో కలిసి ఆండిపట్టిలోని ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.
ఈ క్రమంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో తిరుమురుగన్ ఇంట్లో ఫ్రిజ్ లో పెట్టిన నీళ్లు తాగడానికి వెళ్లాడు. ఫ్రిజ్ డోర్ తీసి చేయి లోపల పెట్టగానే, కరెంట్ షాక్కు గురై గట్టిగా కేకలు వేస్తూ కిందపడిపోయాడు. ఆ సమయంలో వంటింట్లో గిన్నెలు కడుగుతున్న భార్య కనకలక్ష్మి, భర్త అరుపులు విని హుటాహుటిన హాల్లోకి పరుగెత్తుకు వచ్చింది. తిరుమురుగన్ కరెంట్ షాక్తో కింద పడి ఉండటాన్ని గమనించిన ఆమె, సమయస్ఫూర్తితో వ్యవహరించి వెంటనే ఇంటి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసింది. అనంతరం ఇరుగుపొరుగు వారి సహాయంతో తిరుమురుగన్ను అపస్మారక స్థితిలో ఆండిపట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడిని పరీక్షించిన వైద్యులు.. తిరుమురుగన్ అప్పటికే మార్గమధ్యంలోనే మరణించాడని ధృవీకరించారు. కళ్లెదుటే భర్త ప్రాణాలు కోల్పోవడంతో భార్య కనకలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘోర ప్రమాదంపై ఆండిపట్టి పోలీసులు కేసు నమోదు చేసి, ఫ్రిజ్లో షార్ట్ సర్క్యూట్ ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. 24 ఏళ్ల చిన్న వయసులోనే తిరుమురుగన్ ఇలా కరెంట్ షాక్తో మృతి చెందడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.