
మాట్లాడుదామని పిలిపించి ఒక వ్యక్తి తన స్నేహితులతో కలిసి మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ వెలుగు చూసింది. అయితే అంతటి పరిస్థితుల్లోనూ సదురు మహిళ తన ప్రాణాలు కాపాడుకునేందుకు కాలిన గాయాలతో ఆలానే స్కూటీ పై హాస్పిటల్కు చేరుకుంది. కానీ చివరకు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫరూఖాబాద్ చెందిన నిషా సింగ్ అనే 33 ఏళ్ల మహిళ ఈ నెల 6న మెడిసిన్ కొనడానికి వెళ్తున్నానని ఇంట్లో తన కుమారుడికి చెప్పి బయటకు వెళ్లింది. కానీ ఆ తర్వాత ఆమె తిరిగి ఇంటికి రాలేదు. అయితే కొద్ది సేపటికి నిషా తండ్రికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వారు నిషాసింగ్కు తీవ్రంగా కాలిన గాయాలయ్యాయని, ఆమె ప్రస్తుతం సాయ్ఫాయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. దీంతో షాక్కు గురైన ఆమె తండ్రి వెంటనే ఆస్పత్రికి చేరుకున్నాడు. ఏం జరిగిందని తన కూతురిని ఆరా తీశాడు.
అయితే దీపక్ అనే వ్యక్తి తనను తరచూ వేధిస్తున్నాడని.. తాజాగా అతను మాట్లాడుదామని పిలిస్తే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు వెళ్లినట్టు ఆమె చెప్పింది. కానీ అక్కడికి వెళ్లినప్పుడు అక్కడ అతని తోపాటు అతని ఫ్రెండ్స్ ఐదుగురు ఉన్నారని.. వారు తనతో గొడవపడి తనపై పెట్రోల్ పోసి నిప్పింటించారని చెప్పుకొచ్చింది. కాలిన గాయాలతోనే తాను స్కూటీపై ఆస్పత్రికి చేరుకున్నానని తెలిపింది. అయితే అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో మరో హాస్పిటల్కు తరలించగా అక్కడే చికిత్స పొందుతూ నిషా సింగ్ ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.